కుప్పిలి వెంకటేశ్వరరావు
కుప్పిలి వెంకటేశ్వరరావు (1923 నవంబరు 20 - 1973 మే 25), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రంగస్థలనటుడు, దర్శకుడు. ఆయన కె. వెంకటేశ్వరరావుగా తెలుగు సాంఘిక నాటకరంగంలో ప్రసిద్దిచెందాడు.[1]
కె. వెంకటేశ్వరరావు | |
---|---|
జననం | |
మరణం | 1973 మే 25 | (వయసు 49)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల నటుడు |
తల్లిదండ్రులు | సీతయ్యమ్మ (తల్లి ), కుప్పిలి ప్రకాశరావు (తండ్రి) |
ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పాత్రకు ఆయన గొంతు తోనే ప్రాణం పోసాడు. అలాగే, ఆచార్య ఆత్రేయ నిర్మించిన వాగ్దానం చిత్రంలో ఆయన నటించాడు. ఆ తర్వాత మరో రెండు చిత్రాలు ఇద్దరు మిత్రులు, కన్నె వయసు (1973)లలో కూడా నటించాడు.
జీవిత చరిత్ర
ఆయన 1923 నవంబరు 20న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించాడు. రాజమండ్రి గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. 1945లో దక్షిణ మధ్య రైల్వేలోని శ్రీకాళహస్తి స్టేషన్లో చిన్న ఉద్యోగంలో చేరాడు. 1946లో విజయవాడ రైల్వే డివిజన్ ఆఫీస్లోకి బదిలీ అయి, 1960 వరకు అక్కడే ఉద్యోగం చేసాడు. ఆ సమయంలో, ఆయన తెలుగు నాటక రంగంలో ఎనలేని కృషి సల్పాడు. నటనలో, దర్శకత్వంలో పలు బహుమతులు గెలుచుకున్నాడు.
విజయవాడలోని రైల్వే ఇనిస్టిట్యూట్లో ఆయన నాటక దర్శకునిగా బాధ్యతలు నిర్వర్తించాడు. రసజ్ఞుల, సహృదయుల, నటీనటుల సమాఖ్య (ర.స.న.)ను స్థాపించి ఎందరో నటులను తయారుచేసాడు. ఈ సంస్థ ద్వారా నాబాబు, దొంగవీరడు, ఆకాశరామన్న, రాగరాగిణి, కనక పుష్యరాగం, పెళ్ళిచూపులు తదితర నాటకాలు ప్రదర్శించారు.
1958లో, ఆయన ఢిల్లీ చేరుకుని ఏషియన్ థియేటర్ ఇనిస్టిట్యూట్లో నాటకరంగ మెళకువలు తెలుసుకున్నాడు. ఆ సమయంలో, ఆయన దక్షిణభారత నటీనట సమాఖ్యను అక్కడ స్థాపించాడు. దీని మూలంగా చాలా కాలం దేశరాజధానిలో తెలుగు నాటకరంగ కార్యక్రమాలు కొనసాగాయి. అంతేకాకుండా, ఆయన లిటిల్ థియేటర్, బహురూప నట సమాఖ్య వంటి సంస్థలు కూడా స్థాపించాడు.
1961లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రంగస్థల విభాగంలో దర్శకునిగా చేరాడు. ఆ సమయంలో, ఆయన కన్యాశుల్కం, రాగరాగిణి, అసురసంధ్య, కళ్ళు, కొడుకు పుట్టాల వంటి ఎన్నో ప్రదర్శనలను రూపొందించి, స్వయంగా నటించాడు కూడా.
ఆయన 49 సంవత్సరాల వయసులో 1973 మే 25న తుదిశ్వాస విడిచాడు.[2]