సోలిపేట రామలింగారెడ్డి
సోలిపేట రామలింగారెడ్డి (అక్టోబరు 2, 1961 - ఆగస్టు 6, 2020) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, పాత్రికేయుడు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున 2004, 2008 (ఉపఎన్నిక)లలో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి 2014, 2018 ఎన్నికల్లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంందాడు.[1]
సోలిపేట రామలింగారెడ్డి | |||
![]() | |||
నియోజకవర్గం | దొమ్మాట (2004 - 2009) దుబ్బాక శాసనసభ నియోజకవర్గం (2014 - ఆగస్టు 6, 2020) | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు | |||
జననం | చిట్టాపూర్, దుబ్బాక మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ | 1961 అక్టోబరు 2||
మరణం | 2020 ఆగస్టు 6 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 58)||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | సుజాత | ||
సంతానం | సతీష్ రెడ్డి (కుమారుడు), ఉదయశ్రీ (కుమార్తె) | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ |
జీవిత విషయాలు
రామలింగారెడ్డి 1961, అక్టోబరు 2న సిద్ధిపేట జిల్లా, దుబ్బాక మండలం, చిట్టాపూర్ లో జన్మించాడు. రామలింగారెడ్డికి సుజాతతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు సతీష్ రెడ్డి, ఒక కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు.[2]
ఉద్యమ జీవితం
పాఠశాల స్థాయిలోనే ఉద్యమాలపై ప్రేమ పెంచుకున్న రామలింగారెడ్డి, ఇంటర్ తరువాత అర్.ఎస్.యు. (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ప్రజా సమస్యల్లో పాలుపంచుకుంటూ వస్తున్న క్రమంలో పోలీసుల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. 1991లో టాడా కేసు పెట్టారు. విప్లవ సాహిత్యంతోపాటు బాంబులు దొరికాయని, నక్సలైట్ గా పనిచేస్తున్నాడని కేసు పెట్టి నిర్బందంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. నాలుగు రోజులకు సెంట్రల్ జైల్ కు తరలించారు, ఈ క్రమంలోనే దేశ, రాష్ట్రంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. లండన్ లో కూడా ఊద్యమాలు జరిగాయి. కేంద్ర మానవ హక్కుల కమిషనర్ రంగరాజన్ జోక్యంతో కోర్టు విచారణలో పోలీసులు తప్పుడు కేసు పెట్టారని తేలడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు.[3]
వృత్తి జీవితం
1983 తరువాత ఉదయం దినపత్రికలో రిపోర్టర్ గా చేరాడు. వార్త రిపోర్టర్ గా కొనసాగుతూ ఎపియుడబ్ల్యుజె (జర్నలిస్టు యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశాడు. జహీరాబాదులో, సిద్ధిపేటలో వార్త రిపోర్టర్ గా పనిచేశాడు.
రాజకీయ జీవితం
సుమారు 25 ఏళ్ళు పాత్రికేయుడిగా పనిచేసిన రామలింగారెడ్డి కేసీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చాడు. 2004లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి ఎన్నికై తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాడు. 2008 ఉపఎన్నికల్లో కూడా ఎన్నికయిన రామలింగారెడ్డి, 2009 ఎన్నికల్లో ఓడిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డిపై 37,925 ఓట్ల తేడాతో గెలుపొందాడు. 2018లో జరిగిన ముందస్తు తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డిపై 62,500 ఓట్ల తేడాతో గెలుపొందాడు. శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్గా కూడా పనిచేశాడు.[4]
మరణం
అనారోగ్యంతో హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రామలింగారెడ్డి 2020, ఆగస్టు 6న గుండెపోటుతో మరణించాడు.[5][6]