వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల
వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల అనేది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, వనపర్తి పట్టణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల.[1] గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఔత్సాహిక వైద్య విద్యార్థులకు వైద్య పరిజ్ఞానాన్ని అందించేందుకు తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం 2021లో ఈ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించింది. ఇది కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలగా ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ నుండి 2022-23 విద్యా సంవత్సరానికి 150 ఎంబిబిఎస్ సీట్లకు అనుమతి లేఖను అందుకుంది.[2][3]
![]() వనపర్తి ప్రభుత్వ వైద్య కళాశాల భవనం | |
రకం | ప్రభుత్వ వైద్య విద్య |
---|---|
స్థాపితం | 2021 |
అనుబంధ సంస్థ | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
విద్యార్థులు | 150 |
స్థానం | వనపర్తి, వనపర్తి జిల్లా, తెలంగాణ, భారతదేశం |
ఏర్పాటు
2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, వనపర్తిలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై ప్రకటన చేశాడు. 2021 మే 17న జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో వనపర్తిలో కళాశాల ఏర్పాటకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లభించింది.[4] 2022 మార్చి 8న వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3:25 గంటలకు ఈ ప్రభుత్వ వైద్య కళాశాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశాడు.[5] నాలుగు నెలలకాలంలో నిర్మాణం పూర్తయింది.
అనుబంధ ఆసుపత్రి
వనపర్తిలోని ఏరియా ఆసుపత్రి 2016లో జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయబడింది. వైద్య కళాశాల మంజూరైన తరువాత జిల్లా ఆసుపత్రిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం 60మంది డాక్టర్లు (29 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, తొమ్మిదిమంది ప్రొఫెసర్లు, నలుగురు అసోసియేట్ డాక్టర్లు, 17 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఒక సూపరింటెండెంట్), 112 మంది స్టాఫ్ నర్సులను నియమించారు. జీజీహెచ్లో 150 పడకలు, ఎంసీహెచ్లో 180 పడకలు కలిపి మొత్తం 330 పడకలు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా 600 పడకల ఆసుపత్రిని కూడా నిర్మించనున్నారు.[6]
కోర్సులు - శాఖలు
- అనాటమీ
- ఫార్మాకాలజీ
- ఫిజియోలాజీ
- బయోకెమిస్ట్రీ
- పాథాలజీ
- మైక్రోబయోలాజీ
- ఫోరెన్సిక్ మెడిసిన్
- జెనరల్ సర్జరీ
- ఆర్థోపెడిక్స్
- ఓటో-రైనో-లారిగోలజీ
- ఆప్తాల్మోలజీ
- జనరల్ మెడిసిన్
- టిబి & ఆర్డి
- డివిఎల్
- సైకియాట్రీ
- పీడియాట్రిక్స్
- ఓబిజీ
- అనస్థీషియాలజీ
- కమ్యూనిటీ మెడిసిన్
- రేడియోడియాగ్నోసిస్
- ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్
- టీబీసీడీ
- సీటీ సర్జరీ
- న్యూరో సర్జరీ
- న్యూరాలజీ
- ప్లాస్టిక్ సర్జరీ
- యూరాలజీ
- గాస్ట్రోఎంట్రాలజీ
- ఎండోక్రైనాలజీ
- నెఫ్రాలజీ
- కార్డియాలజీ
- ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్
- ఈఎన్టీ
- ఆప్తల్
- అనస్తీషియా
- డెంటల్
ప్రవేశాలు
2022 నీట్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన వారికి ఈ కళాశాలలో సీట్లు కేటాయించబడ్డాయి. వనపర్తి కళాశాలకు మొదటి విడతలో 94 మందిని కేటాయించగా, నవంబరు 7 నాటికి 71మంది ధ్రువపత్రాలను సమర్పించి రిపోర్టు చేశారు.
తరగతుల ప్రారంభం
కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సూపరిం టెండెంట్లు, నియామకం పూర్తవగా, హెడ్నర్సులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారామెడికల్, నాన్ పారా మెడికల్ సిబ్బంది నియామకం కూడా పూర్తయ్యింది. 2022 నవంబరు 15 నుండి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ వేదికగా ఆన్లైన్ ద్వారా ఒకేసారి 8 వైద్య కళాశాలల ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ప్రారంభించి వైద్యరంగంలో గుణాత్మక మార్పుకు, దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయానికి నాందిపలికాడు.[7]
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/e/e6/CM_KCR_open_8_New_Medical_Colleges.jpg/220px-CM_KCR_open_8_New_Medical_Colleges.jpg)