లోయా జిర్గా
లోయా జిర్గా (పష్తో భాషలో "మహానాడు" అని అర్థం) పష్తూన్ సంప్రదాయంలో ఒక ప్రత్యేక రకమైన చట్టపరమైన సమావేశం. దేశాధిఉనేత ఆకస్మికంగా మరణించినపుడు కొత్త దేశాధినేతను ఎన్నుకోవడం, కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడం లేదా యుద్ధం వంటి జాతీయ, ప్రాంతీయ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం నిర్వహిస్తారు. [1] ఇది ఆధునిక-కాలపు వ్రాతపూర్వక లేదా స్థిరమైన చట్టాల కంటే ప్[ఊర్వకాలానికి చెందినది. పష్తూన్ ప్రజలు ఈ పద్ధతిని ఎక్కువగా ఇష్టపడతారు. అయితే పష్తూన్లచే ప్రభావితమైన ఇతర సమీపంలోని సమూహాలు (చారిత్రాత్మకంగా ఆఫ్ఘన్లు అని పిలుస్తారు) దీన్ని అంతగా ఇష్టపడరు.
ఆఫ్ఘనిస్తాన్లో, కనీసం 18వ శతాబ్దం ప్రారంభంలో హోటాకి, దుర్రానీ రాజవంశాలు అధికారంలోకి వచ్చినప్పటి నుండి లోయా జిర్గా లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. [2]
చరిత్ర, పరిభాష
ప్రాచీన ఆర్యన్ తెగలు, ప్రోటో-ఇండో-ఇరానియన్ భాష మాట్లాడేవారని చెప్పబడే తెగలు, మధ్య ఆసియా, ఆఫ్ఘనిస్తాన్ నుండి అడపాదడపా అలలు అలలుగా వచ్చినట్లు ఒక పౌరాణిక కథనం ఉంది. వారు రెండు రకాల కౌన్సిల్లతో కూడిన జిర్గా విధానాన్ని పాటించారు. అవి సిమిటే, సభా. సిమిటే (శిఖరం) లో పెద్దలు, గిరిజన నాయకులూ ఉంటారు. రాజు కూడా సిమిటే సమావేశాల్లో కూర్చుంటాడు. సభా ఒక విధమైన గ్రామీణ మండలి. భారతదేశంలో వీటిని సమితి, సభ అని పిలుస్తారు .
కాలక్రమేణా పాలకులు, అధిపతుల ఎంపికకూ, సూత్రప్రాయమైన విషయాలను ప్రసారం చేయడానికీ వీటిని ఉపయోగించారు. గొప్ప కుషాణు పాలకుడైన కనిష్కుడి కాలం నుండి 1970ల వరకు పదహారు జాతీయ లోయా జిర్గాలు, వందల కొద్దీ చిన్న లోయా జిర్గాలూ జరిగాయి. శతాబ్దాల నాటి ఈ సంప్రదాయం, ఇస్లామిక్ షూరా (సంప్రదింపుల సభ) మాదిరిగానే ఉంటుంది. [3]
ఆఫ్ఘన్ సమాజంలో, ఇతర తెగలతో అంతర్గత లేదా బాహ్య వివాదాలను పరిష్కరించడానికి గిరిజన నాయకులు ఇప్పటికీ లోయా నిర్వహిస్తూంటారు. కొన్ని సందర్భాల్లో ఇది టౌన్ హాల్ సమావేశం లాగా పనిచేస్తుంది.
ఆఫ్ఘన్లు అధికారం చేపట్టినప్పుడు వారు అలాంటి జిర్గాతో తమ పట్టును చట్టబద్ధం చేసుకోవడానికి ప్రయత్నించారు. ప్రారంభంలో పష్టూన్లకు మాత్రమే జిర్గాల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండగా, తరువాత తజిక్లు, హజారాల వంటిఒ ఇతర జాతి సమూహాలను కూడా వీటికి అనుమతించారు. అయితే వారు పరిశీలకుల స్థాయి కన్న కొద్దిగా పై స్థాయిలో ఉండేవారంతే. జిర్గాల సభ్యులు ఎక్కువగా రాజకుటుంబ సభ్యులు, మత పెద్దలు, ఆఫ్ఘన్ల గిరిజన నాయకులు. రాజు అమానుల్లా ఖాన్ జిర్గాను సంస్థాగతీకరించాడు. అమానుల్లా నుండి మొహమ్మద్ జహీర్ షా (1933-1973), మహమ్మద్ దావూద్ ఖాన్ (1973-1978) ల పాలన వరకు జిర్గాను ప్రాంతీయ పష్టూన్ నాయకుల ఉమ్మడి సమావేశంగా గుర్తించారు.
సమావేశాలు ఒక వ్యవధి ప్రకారం జరగవు. ఏవైనా సమస్యలు లేదా వివాదాలు తలెత్తినప్పుడు మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తారు. లోయాజిర్గా ను ముగించడానికి, ఒక కాలపరిమితి అంటూ లేదు. నిర్ణయాలను సమూహంగా మాత్రమే తీసుకోవడం, వాదనలు రోజుల తరబడి జరగడం వంటి కారణాల వలన తరచూ ఈ సమావేశాలు రోజుల తరబడి జరుగుతూంటాయి. పెద్ద విపత్తు, విదేశాంగ విధానం, యుద్ధ ప్రకటన, నాయకుల చట్టబద్ధత, కొత్త ఆలోచనలు చట్టాల పరిచయం వంటి వివిధ సమస్యలను లోయాజిర్గాల్లో చేపడతారు.
ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో జరిగిన కొన్ని లోయా జిర్గాలు:
- 1707-1709 - మీర్ వైస్ హోటక్ కాందహార్లో 1707 లో లోయా జిర్గాను నిర్వహించాడు. కానీ గులాం మొహమ్మద్ ఘోబర్ ప్రకారం అది జరిగినది 1709 లో, మంజాలో. [4]
- 1747 అక్టోబరు - కాందహార్ వద్ద జరిగిన ఈ లోయా జిర్గాకు ఆఫ్ఘన్ ప్రతినిధులు హాజరయ్యారు. వారు అహ్మద్ షా దురానీని తమ కొత్త నాయకుడిగా నియమించారు.
- 1928 సెప్టెంబరు - రాజు అమానుల్లా తన పాలనలో (1919-1929) మూడవ లోయా జిర్గాను పాగ్మాన్ వద్ద సంస్కరణలను చర్చించడానికి ఏర్పరచాడు.
- 1930 సెప్టెంబరు - సింహాసనంపై తన అధికారాన్ని ధృవీకరించడానికి మహమ్మద్ నాదిర్ షా లోయా జిర్గాను ఏర్పరచాడు.
- 1941 - రెండవ ప్రపంచ యుద్ధంలో తటస్థతను ఆమోదించడానికి మహ్మద్ జహీర్ షా ఏర్పాటు చేసాడు.
- 1947 - భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడాన్ని ఎంచుకోవడానికి గిరిజన ఏజెన్సీలలోని పష్టూన్లు నిర్వహించారు.
- 1949 జూలై 26 - వివాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ సంబంధాలు వేగంగా క్షీణించాయి. రెండు దేశాల మధ్య ఇకపై 1893 డ్యూరాండ్ లైన్ సరిహద్దును గుర్తించడం లేదని అధికారికంగా ప్రకటించింది. [5]
- 1964 సెప్టెంబరు - కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి మహమ్మద్ జహీర్ షా 452 మందితో ఏర్పాటు చేసాడు.
- 1974 జూలై – డురాండ్ లైన్ గురించి పాకిస్తాన్తో సమావేశం.
- 1977 జనవరి - రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో ఏక-పార్టీ పాలనను ఏర్పాటు చేస్తూ మొహమ్మద్ దావూద్ ఖాన్ కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించాడు.
- 1985 ఏప్రిల్ - డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి.
- 1990 మే - మొహమ్మద్ నజీబుల్లా ఆధ్వర్యంలో రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించడానికి ఏర్పాటైంది.
- 2001 సెప్టెంబరు - తాలిబాన్ పాలన ముగింపును అంచనా వేస్తూ నాలుగు వేర్వేరు లోయా జిర్గాలు జరిగాయి. అవి ఒకదాన్నొకటి పెద్దగా సంప్రదించుకోలేదు.
- మొదటిది రోమ్లో మొహమ్మద్ జహీర్ షా జరిపాడు. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన మితవాద పష్టూన్ల ప్రయోజనాలను ప్రతిబింబిస్తుంది. న్యాయమైన ఎన్నికలు, ఆఫ్ఘన్ రాష్ట్ర పునాదిగా ఇస్లాంకు మద్దతు, మానవ హక్కులను గౌరవించడం దీని నిర్ణయాలు.
- రెండవది సైప్రస్లో జరిగింది. ఇస్లామిక్ పార్టీ సభ్యుడు,గుల్బుద్దీన్ హెక్మత్యార్కు మామా అయిన హోమయోన్ జరీర్ నేతృత్వంలో జరిగింది. దీని విమర్శకులు అది ఇరాన్ ప్రయోజనాలకు ఉపయోగపడుతోందని అనుమానించారు. అయితే, దీని సభ్యులు తమను తాము ఆఫ్ఘన్ ప్రజలకు సన్నిహితంగా భావించారు. రోమ్ సమూహం ఒంటరిగా ఉన్న ప్రభువులకు సన్నిహితులని భావిస్తారు.
- అత్యంత ముఖ్యమైనది జర్మనీలో జరిగింది. దీని ఫలితంగా బాన్ ఒప్పందం (ఆఫ్ఘనిస్తాన్) కుదిరింది . ఈ ఒప్పందం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఆఫ్ఘన్ మధ్యంతర అథారిటీని స్థాపించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగాన్ని స్థాపించిన జిర్గాలకు ఇది మార్గాన్ని సుగమం చేసింది.
- అంతగా ప్రాముఖ్యత లెని జిర్గా ఒకటి పాకిస్థాన్లో జరిగింది.
- జూన్-జూలై 2002 - హమీద్ కర్జాయ్ దీనిని పర్యవేక్షించడానికి ఎన్నికయ్యాడు. 2001 చివరలో, కర్జాయ్ తాలిబాన్ యొక్క క్రూరమైన పాలనకు వ్యతిరేకంగా అతిపెద్ద దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ తెగలలో ఒకదానిని విజయవంతంగా నడిపించగలిగాడు. ఈ లోయా జిర్గాను హమీద్ కర్జాయ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్వహించింది, దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎన్నికల ద్వారా ఎంపికైన, లేదా వివిధ రాజకీయ, సాంస్కృతిక మత సమూహాలకు కేటాయించిన సుమారు 1600 మంది ప్రతినిధులతో ఇది జరిగింది. ఇది జూన్ 11 నుండి కాబూల్ పాలిటెక్నిక్ మైదానంలో ఒక పెద్ద టెంట్లో నిర్వహించారు. దాదాపు ఒక వారం పాటు జరిగిన ఈ జిర్గాలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. అది కొంతకాలం తర్వాత అధికారం చేపట్టింది.
- 2003 డిసెంబరు - ప్రతిపాదిత ఆఫ్ఘన్ రాజ్యాంగాన్ని పరిశీలించడానికి ఏర్పాటైంది.
- 2006 - ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ హమీద్ కర్జాయ్ తాను పాకిస్తానీ అధ్యక్షుడు సంయుక్తంగా సరిహద్దు దాడులపై వివాదాన్ని ముగిస్తామని ప్రకటించేందుకు ఈ లోయా జిర్గాను ఏర్పరచాడు. [6]
- డిసెంబరు 2009, తన వివాదాస్పద ఎన్నిక తర్వాత తాలిబాన్ తిరుగుబాటు గురించి చర్చించడానికి ఈ లోయా జిర్గాను ఏర్పాటు చేసాడు. ఈ జిర్గాలో పాల్గొనడానికి తాలిబాన్లను ఆహ్వానించాడు. [7] కానీ వారు తిరస్కరించారు.
- 2010 జూన్, కాబూల్లో, తాలిబాన్తో శాంతి చర్చల కోసం అన్ని జాతులతో ఒక లోయా జిర్గాను నిర్వహించారు. [8] [9]
- 2013 నవంబరు 17, కాబూల్లో సుమారు 2,500 మంది ఆఫ్ఘన్ పెద్దలు 2014 తర్వాత పరిమిత సంఖ్యలో US దళాల ఉనికిని ఆమోదించారు [10]
- 2019 ఏప్రిల్ 29 - మే 3, కాబూల్లోని బాగ్-ఇ బాలా ప్యాలెస్లో తాలిబాన్తో శాంతి చర్చలకు ఉమ్మడి విధానాన్ని అంగీకరించడానికి జరిగింది. జిర్గాకు అబ్దుల్ రసూల్ సయ్యఫ్ అధ్యక్షత వహించగా 3,200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. తాలిబన్లు హాజరుకావడానికి నిరాకరించారు. [11]
- 2020 ఆగస్టు 7–9, ఆఫ్ఘన్ శాంతి ప్రక్రియలో భాగంగా విడుదల చేయాల్సిన తీవ్రమైన నేరాలకు పాల్పడిన 400 మంది తాలిబాన్ ఖైదీల భవితవ్యాన్ని నిర్ణయించడం జరిగింది. [12] [13]
బ్రిటిష్ ఇండియా, పాకిస్తాన్
1947 జూన్ 21 న, భారతదేశ విభజనకు కేవలం ఏడు వారాల ముందు బచా ఖాన్, అతని సోదరుడు ముఖ్యమంత్రి డాక్టర్ ఖాన్ సాహిబ్, ఖుదాయి ఖిద్మత్గార్లు, ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యులు, మీర్జాలీ ఖాన్ (ఐపీకి చెందిన ఫకీర్) ఇతర గిరిజన పెద్దలతో కూడిన ఒక లోయా జిర్గా బన్నులో జరిగింది. ఇది బన్నూ తీర్మానాన్ని ప్రకటించింది. భారతదేశం లేదా పాకిస్తాన్లో చేరడానికి బదులుగా బ్రిటీష్ ఇండియాలోని అన్ని పష్తున్ భూభాగాలను చేర్చి పష్తూనిస్తాన్ స్వతంత్ర దేశం ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే, బ్రిటీష్ రాజ్ ఈ తీర్మానం లోని డిమాండ్ను అంగీకరించడానికి నిరాకరించారు. దీనికి ప్రతిస్పందనగా ఖుదాయి ఖిద్మత్గార్లు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు. [14] [15]
బలూచిస్తాన్లో శాంతి కోసం 2006 ఏప్రిల్లో, మాజీ బలూచిస్తాన్ ముఖ్యమంత్రి తాజ్ ముహమ్మద్ జమాలీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, లోయా జిర్గాకూ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు. [16] 2006 సెప్టెంబరులో కలాట్ వద్ద ఒక లోయ జిర్గా జరిగింది. బలోచ్ ప్రజల సార్వభౌమత్వానికీ హక్కులకూ సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు దాఖలు చేస్తామని ఇందులో ప్రకటించారు. [17] [18] [19] [20]