లుధియానా
లుధియానా పంజాబ్ రాష్ట్రంలోని నగరం. లుధియానా జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది పంజాబ్లో అతిపెద్ద నగరం. ఢిల్లీకి ఉత్తరాన ఉన్న నగరాల్లో కెల్లా అతిపెద్దది. నగరం విస్తీర్ణం 311 చ.కి.మీ. 2011 జనాభా లెక్కల ప్రకారం నగర జనాభా 16,18.879. ఈ నగరం సట్లెజ్ నది పాత నదీ మార్గపు ఒడ్డున, ప్రస్తుత నదీతీరం నుండి దక్షిణాన 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఉత్తర భారతదేశం లోని పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. బిబిసి దీనిని భారతదేశపు మాంచెస్టర్ అని వర్ణిస్తుంది.[2] భారత ప్రభుత్వం అభివృద్ధి చేయబోయే స్మార్ట్ సిటీల జాబితాలో లుధియానా ఒకటి. ప్రపంచ బ్యాంక్ ప్రకారం వ్యాపారం చేసేందుకు భారతదేశంలో అనుమైన నగరంగా నిలిచింది.
లుధియానా | |
---|---|
మెట్రోపాలిటన్ | |
Coordinates: 30°55′N 75°51′E / 30.91°N 75.85°E | |
దేశం | భారతదేసం |
రాష్ట్రం | పంజాబ్ |
జిల్లా | లుధియానా |
తహసీలు | లుధియానా తూర్పు లుధియానా పశ్చిమ |
Founded by | లోధి వంశం |
విస్తీర్ణం | |
• Total | 310 కి.మీ2 (120 చ. మై) |
Elevation | 262 మీ (860 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 16,18,879 |
• Rank | భారత్లో 22వ స్థానం |
• జనసాంద్రత | 5,200/కి.మీ2 (14,000/చ. మై.) |
Demonym | లుధియాన్వీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | Multiple 141001-141016 |
టెలిఫోన్ కోడ్ | 0161 |
Vehicle registration | PB-10, PB-91 |
లుధియానా రాష్ట్ర రాజధాని చండీగఢ్ నుండి పశ్చిమంగా 107 కిలోమీటర్ల దూరంలో ఉంది. న్యూఢిల్లీ - అమృత్సర్ నేషనల్ హైవే 44 పై ఉంది. ఇది ఢిల్లీ నుండి ఉత్తరాన 315 కిమీ దూరం లోను, అమృత్సర్ నుండి ఆగ్నేయంగా 142 కిమీ దూరం లీలోనూ ఉంది.
భౌగోళికం
లుధియానా 30°54′N 75°51′E / 30.9°N 75.85°E నిర్దేశాంకాల వద్ద ఉంది.[3] సముద్ర మట్టం నుండి దీని సగటు ఎత్తు 244 మీటర్లు. లుధియానాలో పాత నగరం, కొత్త నగరం అనే రెండూ విభాగాలున్నాయి. ప్రధానంగా సివిల్ లైన్స్ ప్రాంతం కొత్త నగరం. ఇక్కడ బ్రిటిష్ వారి నివాసాలు, అధికారిక నివాసాలూ ఉండేవి
చరిత్ర
ఢిల్లీ సుల్తానేట్కు చెందిన లోధి రాజవంశీకులు1480 లో లుధియానాను స్థాపించారు.[4] పాలక సుల్తాన్, సికందర్ లోధి, తన రాజవంశానికి చెందిన ఇద్దరు పెద్దలు, యూసఫ్ ఖాన్, నిహంద్ ఖాన్లను పంపించి, ఈ ప్రాంతంపై లోధిల ఆధిపత్యాన్ని స్థాపించాడు. ఇద్దరు వ్యక్తులు ప్రస్తుత లుధియానా స్థలంలో శిబిరం వేసుకున్నారు. ఆ స్థలమే అప్పటి మీర్ హోటా అనే గ్రామం. యూసఫ్ ఖాన్ సట్లెజ్ దాటి సుల్తాన్పూర్ను స్థాపించగా, నిహంద్ ఖాన్ మీర్ హోటా స్థలంలో లుధియానాను స్థాపించాడు. ఈ పేరు మొదట " లోధి-అనా ", అంటే "లోధి పట్టణం", అదే ప్రస్తుత లుధియానాకు మారింది.[5] లోధి కోట, లేదా " పురానా ఖిలా ", నగరంలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఆ కాలం నాటి ఏకైక నిర్మాణం. ఇది ఫతేగఢ్ ప్రాంతంలో ఉంది. రంజిత్ సింగ్ కాలం లోను, ఆ తరువాత బ్రిటిష్ వారి కాలం లోనూ ఈ కోటను బాగా నిర్వహించారు. కాని అప్పటి నుండి అది నిర్లక్ష్యానికి గురై, మరమ్మతులకు నోచుకోక, జూదగాళ్ళకు, మాదకద్రవ్యాలు వాడేవాళ్ళకు నెలవైంది. దీనిని 2013 డిసెంబరులో రాష్ట్ర రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారు.[6]
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం లుధియానా జనాభా 16,18,879.[1] జనాభాలో 9,50,123 మంది పురుషులు, 7,43,530 మంది మహిళలు ఉన్నారు. అక్షరాస్యత 82.50%.[8]
ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ బ్యాంకు 2009, 2013 సంవత్సరాల్లో ఉత్తమ వ్యాపార వాతావరణం గల భారతదేశంలోని నగరం లుధియానా అని చెప్పింది.[9] పారిశ్రామిక వస్తువులు, యంత్ర భాగాలు, ఆటో భాగాలు, గృహోపకరణాలు, అల్లిన వస్తువులు, దుస్తులు, వస్త్రాలను ఉత్పత్తి చేసే చిన్న తరహా పారిశ్రామిక యూనిట్లు [10] ఎక్కువగా సంపదను సృష్టించాయి. లుధియానా ఆసియాలోనే అతిపెద్ద సైకిళ్ళ తయారీ కేంద్రం. ఏటా కోటికి పైగా సైకిళ్ళను ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశపు మొత్తం సైకిళ్ళ ఉత్పత్తిలో సగం కంటే ఎక్కువ. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ట్రాక్టర్ విడిభాగాలలో 60% లుధియానాలోనే ఉత్పత్తి అవుతాయి. ఆటో, ద్విచక్ర వాహన భాగాలు కూడా ఎక్కువగా ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. మెర్సిడెస్, బిఎమ్డబ్ల్యూ వంటి జర్మన్ కార్లలో వాడే విడి భాగాలు కొన్నిటిని లుధియానా పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తారు. దేశీయ కుట్టు యంత్రాల అతిపెద్ద తయారీదారులలో లుధియానా ఒకటి. చేతి పనిముట్లు, పారిశ్రామిక యంత్రాలు ఇక్కడి ఇతర ఉత్పత్తులు. పంజాబ్ లోని ఏ ఇతర నగరాలకన్నా ఎక్కువగా లుధియానా ఆర్థిక తోడ్పాటు నిస్తుంది.
లుధియానా హోసియరీగా (అల్లిక పరిశ్రమ) ప్రసిద్ధి చెందిన లుధియానా వస్త్ర పరిశ్రమ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది [11] శీతాకాలపు దుస్తులలో భారతదేశంలో అత్యధిక వాటాను ఉత్పత్తి చేస్తుంది. ఇది ముఖ్యంగా ఉన్ని స్వెటర్లు, కాటన్ టీ-షర్టులకు ప్రసిద్ధి చెందింది. భారతదేశ ఉన్ని దుస్తుల బ్రాండ్లలో ఎక్కువ భాగం ఇక్కడ ఉన్నాయి. షాల్స్, స్టోల్స్ పరిశ్రమకు కూడా లుధియానా పేరు పొందింది. ప్రధాన దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్లను ఇక్కడి నుండి సరఫరా చేస్తారు. వస్త్ర పరిశ్రమలో దాని ఆధిపత్యం ఫలితంగా దీనిని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.[12] అనేక సాఫ్ట్వేర్ సంస్థలు నగరంలో అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడంతో ఐటి రంగం కూడా పెరుగుతోంది.
విద్య
లుధియానాలో 363 సీనియర్ సెకండరీ, 367 ఉన్నత, 324 మాధ్యమిక, 1129 పాథమిక, ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3,98,770 మంది విద్యార్థులు ఉన్నారు.[13] ఈ పాఠశాలలు చాలావరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదా పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుకు అనుబంధంగా ఉన్నాయి. [14]
వ్యవసాయం
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ విశ్వవిద్యాలయం- పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం .- లుధియానాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద వాటిలో ఇది ఒకటి.[15] ఇటీవల PAU లోని కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ స్థాయిని పెంచి గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంగా (గాడ్వాసు) మార్చారు.
మెడికల్
ఆసియాలో మహిళల కోసం మొట్టమొదటి వైద్య పాఠశాల లుధియానాలోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీని 1894 లో డేమ్ ఎడిత్ మేరీ బ్రౌన్ స్థాపించింది. క్రిస్టియన్ మెడికల్ కాలేజి భారతదేశంలో ఒక ప్రధానమైన, ప్రసిద్ధి చెందిన తృతీయ స్థాయి ఆసుపత్రి. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ముఖ మార్పిడి చేసిన ఆసుపత్రి. దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లుధియానాలోని మరో తృతీయ స్థాయి బోధనా ఆసుపత్రి. ఈ రెండు సంస్థలను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ కళాశాల పంజాబ్లోని బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కు అనుబంధంగా ఉంది.
ఇంజనీరింగ్
గురు నానక్ దేవ్ ఇంజనీరింగ్ కళాశాల ఇంజనీరింగ్ విద్యాసంస్థ. ఇక్కడ సైకిళ్ళు, కుట్టు యంత్రాల కోసం పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉంది.[16]
రవాణా
లుధియానా నుండి ఇతర ప్రాంతాలు, ప్రదేశాలకు చక్కటి రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. లుధియానా రైల్వే స్టేషన్ ఢిల్లీ-అమృత్సర్ మార్గంలో ఉంది. జలంధర్, ఫిరోజ్పూర్, ధురీ, ఢిల్లీ మార్గాల్లో ఇది ఒక ముఖ్యమైన రైల్వే జంక్షను. జమ్మూ, అమృత్సర్, జలంధర్, పటియాలా, పఠాన్కోట్, కాన్పూర్, జైపూర్, చండీగఢ్, అంబాలా, పానిపట్, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలతో సహా భారతదేశంలోని చాలా ప్రదేశాలకు ఈ నగరం నుండి రైళ్ళున్నాయి. ఈ స్టేషన్ ఫిరోజ్పూర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది. లుధియానా, చండీగఢ్ల మధ్య రైలు మార్గం 2013 లో ప్రారంభమైంది. లుధియానా, కోల్కతా మధ్య ప్రత్యేకమైన సరుకు రవాణా మార్గాన్ని కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది.
రోడ్డు
లుధియానా నుండి పంజాబ్ లోని ఇతర నగరాలకు, ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసు లున్నాయి. ప్రధాన జాతీయ రహదారులు NH 44, NH 5 (పాత NH1, NH95), రాష్ట్ర రహదారి SH 11 లు నగరం గుండా పోతాయి.[17][18]
విమానాశ్రయం
లుధియానా విమానాశ్రయాన్ని సహనేవాల్ విమానాశ్రయం అంటారు. ఇది లుధియానా నుండి 5 కి.మీ. దూరం లోని సహనేవాల్ పట్టణం వద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డులో ఉంది. విమానాశ్రయం 130 ఎకరాల్లో విస్తరించి ఉంది.[19] హల్వారా వైమానిక దళ స్టేషన్లో లుధియానా కొత్త విమానాశ్రయం రాబోతోంది.
నగర రవాణా
నగరంలో బస్సు సర్వీసును రద్దు చేసారు. నగరం లోపల తిరగడం ఎక్కువగా ఆటో-రిక్షాలు, సైకిల్ రిక్షాల ద్వారా జరుగుతుంది, అయితే తాజాగా లుధియానా BRTS ను నిర్మించాలని ప్రతిపాదించారు. కాని నిధులు లేకపోవడం వలన, సరైన ప్రణాళిక, నిర్వహణ లేని కారణంగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ పారిశ్రామిక నగరంలో ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారింది
- సుఖ్దేవ్ థాపర్, స్వాతంత్ర్య సమరయోధుడు
- ధర్మేంద్ర, నటుడు
- సునీల్ మిట్టల్, ఎయిర్టెల్, భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు
- సాహిర్ లుధియాన్వి, గేయ రచయిత
- దివ్య దత్తా, నటి
- బ్రిజ్మోహన్ లాల్ ముంజాల్, పారిశ్రామికవేత్త, హీరో గ్రూప్ వ్యవస్థాపకుడు
- రజిందర్ గుప్తా, పారిశ్రామికవేత్త, ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్
- నైనా ధాలివాల్, మోడల్
- రాజ్ ఖోస్లా, దర్శకుడు
- బల్దేవ్ రాజ్ చోప్రా, సినిమా నిర్మాత, దర్శకుడు
- అమర్ సింగ్ చంకిలా, సింగర్
- పంకజ్ కపూర్ నటుడు
- సాదత్ హసన్ మాంటో, రచయిత, నాటక రచయిత