రంగనాథస్వామి దేవాలయం, జియాగూడ
రంగనాథస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జియాగూడలో ఉంది. మూసి నది ఒడ్డునవున్న ఈ పురాతన ఆలయాన్ని 400 ఏళ్ళక్రితం నంగనూర్ ప్రతమ పీఠం నిర్మించింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి పండగకు అనేకమంది భక్తులు వస్తారు.
రంగనాథస్వామి దేవాలయం జియాగూడ దేవాలయం | |
---|---|
![]() దేవాలయ రాజగోపురం | |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | హైదరాబాదు |
ప్రదేశం: | జియాగూడ |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవీడియన్ |
పేరు చరిత్ర
కుతుబ్ షాహి రాజవంశం పాలనలో ఈ ప్రాంతాన్ని షౌకర్ కార్వాన్ (నేటి కార్వాన్) అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో ఎక్కువమంది వైశ్యులు, మున్నూరు కాపు కులాలకు చెందినవారు ఉండేవారు.[1] వారంతా శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. వైష్ణవ నంగనూర్ ప్రతమ పీఠాధిపతి కల్యాణ వనమలై రామానుజ జీయర్ ఇక్కడ విష్ణు ఆరాధన నిర్వహించాడు కాబట్టి, ఈ ప్రదేశానికి అతని పేరుమీద జీయర్గూడ అని పేరు పెట్టారు. స్థానిక ముస్లింలు జీయర్గూడ పదం పలకడం కష్టమనిపించడంతో, ఈ పేరును జియాగూడగా మార్చారు. సంస్కృతంలో, ఈ ప్రాంతం ఇప్పటికీ దాని మునుపటి పేరుతోనే సూచించబడుతుంది.[1]
చరిత్ర, వాస్తుశిల్పం
హైదరాబాద్లో మొట్టమొదటిదైన ఈ ఆలయం 400 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చరిత్రకారుల అభిప్రాయం. ఇది నంగనూర్ ప్రతమ పీఠం చేత స్థాపించబడింది.[1] నంగనూర్ పీఠంలో శ్రీవైష్ణవ సంప్రదాయం తెలిసిన పూజారులు అందుబాటులో లేకపోవడం వల్ల, శ్రీరంగంలోని వనమమలై పీఠం నుండి పూజారులు క్రమం తప్పకుండా ఆరాధన కోసం హైదరాబాద్ వచ్చేవారు.[1] తరువాతికాలంలో భక్తుల సహాయంతో ఈ ఆలయం పునరుద్ధరించబడింది.[1] 2015, ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి మూడు సంవత్సరాల కాలానికి మత, స్వచ్ఛంద దేవాదాయ చట్టం సెక్షన్ 15, 29 కింద మినహాయింపు ఇచ్చారు.[2]
ద్రావిడ శైలిని అనుసరించి మూసి నది ఒడ్డునున్న రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించబడింది. దీనికి మూడు అంచెల రాజగోపురం ఉంది.[1] దేవాలయ ప్రధాన మందిరంలోని రాతిపై పాము మంచం మీద పడుకున్న విష్ణువు రూపంలో రంగనాథుని చిత్రం ఉంది. లక్ష్మీదేవి (రంగనాయకిగా పూజిస్తారు), అండాల్ కొరకు ప్రత్యేక మందిరాలు ఉన్నాయి. గరుడ మందిరం వెనుకవైపు పంచలోహలతో తయారుచేయబడిన ధ్వజస్తంభం ఉంది. గర్భగుడిపైన విష్ణుమూర్తి దశావతార చిత్రాలు ఉన్నాయి.[3]
పండుగలు
ఈ ఆలయం మొదట్లో సాధారణ ఆరాధనలో తెన్కలై సంప్రదాయాన్ని అనుసరించింది, కాని తరువాత వైష్ణవ చిన్న జీయర్ సిఫారసుపై మరింత ప్రత్యేకమైన వనమమలై సంప్రదాయానికి మారారు.[1] ఈ ఆలయ వ్యవహారాలను శ్రీంగరం తిరువెంగలచార్యలు నేతృత్వంలోని వంశపారంపర్య ఆలయ కమిటీ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆలయ పూజారులుగా శేషాచార్యులు, రాజగోపాలచార్యలు, బద్రీనాథ్, శ్రీనివాస రామానుజలు పనిచేస్తున్నారు.;[4] వీరంతా ఆలయ ప్రాంగణంలో నివసించే శ్రుంగరం కుటుంబానికి చెందినవారు.[1]
ఈ ఆలయంలో 2005 నుండి వైకుంఠ ఏకాదశిన ప్రధాన పండుగగా జరుగుతోంది. ఈ ఉత్సవానికి ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.[4] భోగి పండగ నాడు రంగనాథుడు, ఆండల్ వివాహం (గోదా కల్యాణం),[1] మకర సంక్రాంతి మూడవరోజు విశేష ఉత్సవం నిర్వహిస్తారు.
ఇవీ చూడండి
మూలాలు
ఇతర లంకెలు
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)