భారతరత్న

భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారం

భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. ఇది జనవరి 2, 1954లో భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది. ఈ పౌర పురస్కారం కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ప్రధానం చేస్తారు. ఇప్పటివరకు నలభై మందికి ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఈ పురస్కారం 1977 జూలై 13 నుండి 1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్దికాలం పాటు నిలిపివేయబడింది. ఒకే ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఇవ్వబడిన పురస్కారం చట్టబద్ధ సాంకేతిక కారణాల వల్ల వెనుకకు తీసుకొనబడింది.

భారతరత్న
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారంజాతీయ పౌరపురస్కారం
మొదటి బహూకరణ1954
క్రితం బహూకరణ2019
భూపేన్ హాజరికా (మరణాంతరం)
మొత్తం బహూకరణలు45
బహూకరించేవారు

భారత ప్రభుత్వము
ముఖభాగంరావి ఆకుపై సూర్యుడి చిత్రం, దేవనాగరి లిపిలో "భారతరత్న" అనే అక్షరాలు
వెనుకవైపుప్లాటినం భారత జాతీయ చిహ్నందానిక్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యమేవ జయతే అనే అక్షరాలు
రిబ్బను

ఎలాంటి జాతి, ఉద్యోగం, స్థాయి లేదా స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారగ్రహీతల జాబితాను ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫారసు చేయవలసి ఉంటుంది.

భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది (మొదటిది ఆరూ- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉపప్రధాన మంత్రి, ముఖ్య న్యాయాధీశులు). కానీ ఈ గౌరవం వలన ఎలాంటి అధికారాలు లేదా పేరు ముందు ప్రత్యేక బిరుదులూ రావు.

ఈ పురస్కారం పొందిన విదేశీయుల జాబితాలో సరిహద్దు గాంధిగా పేరుపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1987), నెల్సన్ మండేలా (1990) ఉన్నారు.

చరిత్ర

1954, జనవరి 2వ తేదీన రెండు పౌర పురస్కారాలను ప్రారంభిస్తున్నట్లు భారత రాష్ట్రపతి యొక్క కార్యదర్శి కార్యాలయం నుండి ఒక ప్రకటన జారీ అయ్యింది. వాటిలో మొదటిది అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కాగా రెండవది దానికన్నా తక్కువ స్థాయి గల మూడంచెల పద్మవిభూషణ్ పురస్కారం. పద్మవిభూషణ్ పురస్కారం ప్రథమ, ద్వితీయ, తృతీయ వర్గాలుగా విభజించారు[1]. 1955, జనవరి 15న పద్మవిభూషణ్ పురస్కారాన్ని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు వేర్వేరు పురస్కారాలుగా పునర్వర్గీకరించారు[2].

భారతరత్న పురస్కారం కేవలం భారతీయులకే ప్రధానం చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ఈ పురస్కారాన్ని భారత పౌరసత్వం స్వీకరించిన మదర్ థెరీసాకు 1980లో, మరో ఇద్దరు విదేశీయులు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు 1987లో, నెల్సన్ మండేలాకు 1990లో ప్రధానం చేశారు[3]. ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు తన 40వ యేట ఈ పురస్కారం లభించింది. ఈ పురస్కారం లభించినవారిలో ఇతనే అతి పిన్నవయస్కుడు, మొట్టమొదటి క్రీడాకారుడు.[4] సాధారణంగా భారతరత్న పురస్కార ప్రధాన సభ రాష్ట్రపతి భవన్, ఢిల్లీలో జరుగుతుంది. కానీ 1958, ఏప్రిల్ 18వ తేదీన బొంబాయిలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ధొండొ కేశవ కర్వేకు అతని 100వ జన్మదినం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇతడు జీవించి ఉండగా ఈ పురస్కారం అందుకున్నవారిలో అతి పెద్ద వయస్కుడు.[5] 2015 నాటికి ఈ పురస్కారాన్ని మొత్తం 45 మందికి అందజేయగా వారిలో 12 మందికి మరణానంతరం లభించింది[6].

చరిత్రలో ఈ పురస్కారం రెండుసార్లు రద్దు చేయబడింది[7]. మొదటి సారి మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత 1977, జూలై 13వ తేదీన అన్ని పౌరపురస్కారాలను రద్దుచేశారు. తరువాత ఈ పురస్కారాలు 1980, జనవరి 25న ఇందిరాగాంధీ ప్రధాన మంత్రి అయిన తర్వాత పునరుద్ధరించబడ్డాయి[8][9]. 1992లో ఈ పురస్కారాల "రాజ్యాంగ సాధికారత"ను సవాలు చేస్తూ కేరళ, మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాలలో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఈ పురస్కారాలను రెండవసారి రద్దు చేశారు. ఈ వ్యాజ్యాలకు ముగింపు పలుకుతూ 1995 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం ఈ పురస్కారాలను మళ్ళీ పునరుద్ధరించింది[10][11].

నిబంధనలు

భారతరత్న పురస్కారం అత్యున్నత స్థాయిలో ప్రదర్శించిన కృషికి/చేసిన సేవకు గుర్తింపుగా ఎటువంటి జాతి, వృత్తి, స్థాయి, లింగ బేధాలను పాటించకుండా ప్రధానం చేయబడుతుంది.[12] 1954 నాటి నిబంధనల ప్రకారం ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసినవారికి ఇచ్చేవారు.[1] 2011, డిసెంబరులో ఈ నిబంధనలను మార్చి "మానవజాతి అభివృద్ధికి పాటుపడే ఏ రంగానికైనా" అనే పదాన్ని చేర్చారు.[13] 1954 నాటి నిబంధనలు మరణానంతరం ఈ పురస్కారం ప్రకటించడాన్ని అనుమతించేవి కావు. కానీ 1955 జనవరిలో ఈ నిబంధనను సడలించారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి మొట్టమొదటి సారి మరణానంతరం ఈ పురస్కారాన్ని పొందాడు.[2][14] ఈ పురస్కారానికి ప్రతిపాదనలు చేసే పద్ధతి లేనప్పట్టికీ, ప్రధానమంత్రి మాత్రమే రాష్ట్రపతికి ఏడాదికి గరిష్ఠంగా ముగ్గురిని మాత్రం సిఫారసు చేయవచ్చు. కానీ 1999లో ఈ పురస్కారాన్ని నలుగురు వ్యక్తులకు ప్రధానం చేశారు. ఈ పురస్కార గ్రహీతలకు రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక "సనదు(పట్టా)", ఒక పతకం ప్రధానం చేస్తాడు. ఈ పురస్కారం క్రింద ఎలాంటి నగదు మంజూరు చేయరు. భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 18 (1) ప్రకారం ఈ పురస్కార గ్రహీతలెవ్వరూ తమ పేరు ముందు, వెనుక భారతరత్న అని పేర్కొనరాదు,[15] [12] భారతరత్న పొందిన పౌరులకు 7వ స్థాయి గౌరవం లభిస్తుంది.[16]

భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఎన్ని ప్రకటనలు వెలువడినా, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు ప్రచురించే గెజిట్‌లో అధికారికంగా ప్రకటించిన తర్వాతనే ఈ పురస్కారం అధికారికంగా లభించినట్లు భావిస్తారు.[1][2]

నిర్దేశాలు

1954 నిర్దేశాల ప్రకారం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్థం కలిగిన వృత్తాకార బంగారు పతకాన్ని ఈ పురస్కార సమయంలో బహూకరిస్తారు. పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉండి, కింది భాగంలో వెండితో "భారత రత్న" అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనకవైపు మధ్యభాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది.[1]

ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి నకలు ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 మి.మీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 మి.మీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (మి.మీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 మి.మీ.) వ్యాసార్థం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 మి.మీ.) నుంచి 1⁄2 దాకా (13 మి.మీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు.[2][7][17] 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు.[1][18] భారత రత్న పతకాలను కలకత్తాలోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ, పరమ వీర చక్ర, వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు.[19]

వివాదాలు

1992లో సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటించినట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. తరువాత 1997లో అత్యున్నత న్యాయస్థానం దీనిని రద్దుచేసింది.

భారతరత్న పురస్కార ప్రధానంపై అనేక వివాదాలు ముసురుకున్నాయి. అనేక ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు నమోదు కాబడ్డాయి[10][20][21][22][23].

సుభాష్ చంద్రబోస్ (1992)

1992, జనవరి 23వ తేదీన రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్‌కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రకటిస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన వెలువడింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో ఈ పురస్కారాన్ని ఉపసంహరించుకోవాలని ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది.[20] 1945, ఆగష్టు 18 నాడు సుభాష్ చంద్రబోస్ మరణించాడనే విషయాన్ని భారతప్రభుత్వం ఇంతవరకూ అధికారికంగా అంగీకరించలేదని, అలాంటి సమయంలో అతనికి మరణానంతర పురస్కారం ఎలా ఇస్తారని ఫిర్యాది ప్రశ్నించాడు. సుభాస్ చంద్రబోస్ ఆచూకీని షానవాజ్ కమిటీ (1956), ఖోస్లా కమిషన్ (1970) నివేదికల ఆధారంగా కనిపెట్టాలని ఫిర్యాది తన వ్యాజ్యంలో అభ్యర్థించాడు. సుభాష్ చంద్రబోస్ కుటుంబీకులు ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి విముఖత వ్యక్తం చేశారు.[24][25]

సుజాత వి.మనోహర్, జి.బి.పట్నాయక్‌లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ప్రత్యేక విభాగ ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తూ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రధానంలో కొన్ని నిబంధనలను పాటించడం లేదని గుర్తించింది. పురస్కార గ్రహీతల పేర్లు గెజిట్ ఆఫ్ ఇండియాలో తప్పక ప్రచురించాలని, రాష్ట్రపతి అజమాయిషీలో ఒక రిజిస్టర్ నిర్వహించాలనీ, దానిలో ఈ పురస్కార గ్రహీతల పేర్లు నమోదు చేయాలని స్పష్టం చేసింది.[1] అంతే కాక అప్పటి రాష్ట్రపతులు ఆర్.వెంకట్రామన్ (1987-92), శంకర్ దయాళ్ శర్మ (1992-97)లు వారి సంతకం, ముద్రలతో కూడిన "సనదు" (పట్టా)ను ప్రధానం చేయలేదని గుర్తించింది.[24]

1997, ఆగష్టు 4వ తేదీన అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇస్తూ, ఈ పురస్కార ప్రధానం జరగలేదు కాబట్టి, రాష్ట్రపతి కార్యదర్శి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనను కొట్టివేసింది. బోసు మరణం గురించి కాని, మరణానంతర ప్రస్తావన గురించి కాని ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి నిరాకరించింది.[24];[26] "బిరుదులు"గా పౌరపురస్కారాలు (1992)

1992లో మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఒకటి, కేరళ ఉన్నత న్యాయస్థానంలో మరొకటి రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇద్దరు ఫిర్యాదుదారులూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం ఈ పౌరపురస్కారాలను బిరుదులుగా పరిగణించడాన్ని సవాలు చేశారు. 1992, ఆగష్టు 25వ తేదీన మధ్యప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులను జారీ చేస్తూ అన్ని పౌరపురస్కారాలను తాత్కాలికంగా రద్దు చేసింది[10]. అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసుల గురించి ఎ.ఎం.అహ్మది, కుల్‌దీప్ సింగ్, బి.పి.జీవన్‌రెడ్డి, ఎన్.పి.సింగ్, ఎస్.సాఘిర్ అహ్మద్ అనే ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక విభాగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగ ధర్మాసనం 1995, డిసెంబరు 15న ఈ పౌరపురస్కారాలను పునరుద్ధరిస్తూ, ఈ పౌరపురస్కారాలు "బిరుదులు"గా పరిగణించరాదని పేర్కొంది.[11]

సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్ (2013)

సి.ఎన్.ఆర్.రావు, సచిన్ టెండూల్కర్‌లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు 2013, నవంబరులో ప్రకటన వెలువడగానే అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయబడ్డాయి. సి.ఎన్.ఆర్. రావుకు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో హోమీ భాభా, విక్రం సారాభాయ్ వంటి అనేక శాస్త్రజ్ఞులు రావు కంటే ఎక్కువ సేవలను అందించారని, 1400 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు రావు చేస్తున్న దావా "భౌతికంగా అసాధ్యం" అని వాదించారు. రావు "భావ చౌర్యాని"కి పాల్పడినట్లు నిరూపితమైనదని, అతనికి భారతరత్న పురస్కారం ప్రధానం చేయరాదని, ఈ ప్రతిపాదనను కొట్టివేయాలని కోరారు.[21] టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేయబడిన వ్యాజ్యంలో అతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.[22] టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేసిన మరొక వ్యాజ్యంలో భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు.[23][a]

2013, డిసెంబరు 4న ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరుగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌరపురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం క్రింద రాదని పేర్కొంటూ వినతిని తిరస్కరించింది.[27] మిగిలిన ఉన్నత న్యాయస్థానాలు కూడా సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్‌లకు వ్యతిరేకంగా వేసిన వ్యాజ్యాలను తిరస్కరించాయి.[28]

విమర్శలు

1988లో చలనచిత్రనటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై విమర్శలు వచ్చాయి.[29][30]బి.ఆర్.అంబేద్కర్, వల్లభభాయ్ పటేల్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల కన్నా ముందే ఎం.జి.రామచంద్రన్‌కు భారతరత్న పురస్కారం ప్రకటించడం విమర్శలకు దారితీసింది.[31]రవిశంకర్ ఈ పురస్కారానికై పైరవీలు చేశాడని,[32] 1977లోకె.కామరాజ్‌కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలని ఇందిరా గాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికి అనే ఆరోపణలు వినిపించాయి. దళితులను ప్రసన్నం చేసుకోవడానికి వి.పి.సింగ్ అంబేద్కరుకు మరణానంతరం భారతరత్న ఇప్పించాడని విమర్శలు వెలువడ్డాయి.[33][29]

భారత స్వాతంత్ర్య సంగ్రామానికంటే, అంటే 1947 కంటే ముందు, లేదా ఈ పురస్కారం ప్రారంభించిన ఏడాది 1954 కంటే ముందు మరణించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రకటించడాన్ని పలువురు చరిత్రకారులు తప్పుబట్టారు.[34] ఇటువంటి ప్రధానాలు మౌర్య చక్రవర్తి అశోకుడు,[35] మొఘల్ చక్రవర్తి అక్బర్, మరాఠా వీరుడు శివాజీ, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్,[36] హిందూ ఆధ్యాత్మికవాది స్వామి వివేకానంద,,[37] స్వాతంత్ర్య యోధుడు బాలగంగాధర తిలక్[38] వంటి అనేకులకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే డిమాండ్లకు వీలు కల్పించాయి. అప్పటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు 1991లో వల్లభభాయి పటేల్‌కు అతడు మరణించిన 41 సంవత్సరాల తర్వాత ఈ పురస్కారం ప్రకటించడాన్ని, 1945 నుండి ఆచూకీ లేని సుభాష్ చంద్రబోస్‌కు 1992లో ప్రకటించడాన్ని విమర్శించారు.[38][39] అలాగే 2015లో నరేంద్ర మోడీ 1946లో మరణించిన మదన్ మోహన్ మాలవ్యాకు ఇవ్వాలని నిర్ణయించడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్థన్ ద్వివేది తప్పుపట్టాడు. మాలవ్యా వారణాశిలో ఎక్కువగా పనిచేశాడని, మోడీ వారణాశి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడు కావాలని ఉద్దేశ పూర్వకంగా మాలవ్యాను ఈ పురస్కారానికి ఎంపిక చేశాడని ఆరోపించాడు.[40]

కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కాని ఈ పురస్కారానికి ఎంపిక చేయలేదనే విమర్శలు వెలువడ్డాయి.[41] మదర్ థెరెసాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చిన తరువాతి సంవత్సరం భారతరత్న ప్రకటించారు. సత్యజిత్ రేకు ఆస్కార్ పురస్కారం అందిన తర్వాతనే భారతరత్న ప్రకటించారు.[42][43] అలాగే అమర్త్య సేన్‌కు నోబెల్ బహుమతి వచ్చిన తర్వాతనే భారతరత్న ఇవ్వబడింది.[44][45]

ప్రముఖ డిమాండ్లు

నిబంధనల ప్రకారం భారతరత్న పురస్కారానికి రాష్ట్రపతికి, ప్రధానమంత్రి మాత్రమే సిఫార్సులు చేసే హక్కు ఉంది.[12] వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రముఖ నాయకుల పేర్లను ఎన్నోసార్లు సిఫార్సుకు డిమాండ్లు చేస్తూనే ఉన్నాయి. 2008 జనవరిలో, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్.కె.అద్వానీ, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయికు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు.[46][47] ఇది జరిగిన వెంటనే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) తమ నాయకుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసుకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బసు భారతదేశంలోనే అత్యంత ఎక్కువసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకునిగా చరిత్ర సృష్టించిన వ్యక్తి. అయితే తనకు భారత రత్న వద్దనీ, అందుకు తాను అర్హుణ్ణి కాదనీ, దాని వల్ల ఆ పురస్కారానికి గౌరవం తగ్గుతుంది అని వ్యాఖ్యానించారు.[48][49] తెలుగు దేశం పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీ దళ్ వంటి ప్రాంతీయ రాజకీయ పార్టీలు కూడా తమ తమ నాయకులైన ఎన్.టి.రామారావు, కాన్షీరామ్, ప్రకాష్ సింగ్ బాదల్ లకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.[50] 2015 సెప్టెంబరులో, ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన శివసేన, ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్కు పురస్కారం ఇవ్వాలని డిమాండు చేసింది. ఆయనను మునుపటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని పేర్కొంది. అయితే వినాయక్ కుటుంబసభ్యులు ఈ అభ్యర్థనను తాము సమర్ధించబోమనీ, వినాయక్ కు పురస్కారం రావాలని తాము డిమాండు చేయట్లేదనీ, స్వాతంత్ర్యం కోసం దేశానికి ఆయన చేసిన సేవలను భారతరత్న ఇవ్వకపోతే జాతి మరచిపోదని స్పష్టం చేయడం విశేషం.[51]

భారతరత్న పురస్కారం పొందిన వారి జాబితా[6]

పేరుసంవత్సరం
సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888-1975)1954
చక్రవర్తుల రాజగోపాలాచారి (1878-1972)1954
డా.సి.వి.రామన్ (1888-1970)1954
డా. భగవాన్ దాస్ (1869-1958)1955
డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (1861-1962)1955
జవహర్ లాల్ నెహ్రూ (1889 -1964)1955
గోవింద్ వల్లభ్ పంత్ (1887-1961)1957
ధొండొ కేశవ కార్వే (1858-1962)1958
డా. బీ.సీ.రాయ్ (1882-1962)1961
పురుషోత్తమ దాస్ టాండన్ (1882-1962)1961
రాజేంద్ర ప్రసాద్ (1884-1963)1962
డా. జాకీర్ హుస్సేన్ (1897-1969)1963
పాండురంగ వామన్ కానే (1880-1972)1963
లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (1904-1966)1966
ఇందిరాగాంధీ (1917-1984)1971
వీ.వీ.గిరి (1894-1980)1975
కే.కామరాజు (మరణానంతరం) (1903-1975)1976
మదర్ థెరీసా (1910-1997)1980
ఆచార్య వినోబా భావే (మరణానంతరం) (1895-1982)1983
ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (1890-1988)1987
యం.జి.రామచంద్రన్ (మరణానంతరం) (1917-1987)1988
బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం) (1891-1956)1990
నెల్సన్ మండేలా (జ. 1918)1990
రాజీవ్ గాంధీ (మరణానంతరం) (1944-1991)1991
సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం) (1875-1950)1991
మొరార్జీ దేశాయి (1896-1995)1991
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం) (1888-1958)1992
జే.ఆర్.డీ.టాటా (1904-1993)1992
సత్యజిత్ రే (1922-1992)1992
సుభాష్ చంద్ర బోస్ (1897- ------) (తరువాత ఉపసంహరించబడినది)1992
ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ (జ. 1931-2015)1997
గుర్జారీలాల్ నందా (1898-1998)1997
అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (1906-1995)1997
ఎం.ఎస్.సుబ్బలక్ష్మి (1916-2004)1998
సి.సుబ్రమణ్యం (1910-2000)1998
జయప్రకాశ్ నారాయణ్ (1902-1979)1998
రవి శంకర్ (జ. 1920)1999
అమర్త్య సేన్ (జ. 1933)1999
గోపీనాథ్ బొర్దొలాయి (జ. 1927)1999
లతా మంగేష్కర్ (జ. 1929)2001
బిస్మిల్లా ఖాన్ (జ 1916)2001
భీమ్ సేన్ జోషి (జ. 1922)2008
సచిన్ టెండూల్కర్2014
సి. ఎన్. ఆర్. రావు2014
మదన్ మోహన్ మాలవ్యా2015
అటల్ బిహారీ వాజపేయి2015
ప్రణబ్ ముఖర్జీ2019
నానాజీ దేశ్‌ముఖ్2019
భూపెన్ హజారిక2019
కర్పూరీ ఠాకూర్ (మరణానంతరం) (1924 - 1988)2024[52]
లాల్ కృష్ణ అద్వానీ2024[52]
యం.యస్.స్వామినాధన్ (మరణానంతరం) (1925 - 2023)2024[52]
చౌదరి చరణ్ సింగ్ (మరణానంతరం) (1902 - 1987)2024[52]
పి.వి. నరసింహారావు (మరణానంతరం) (1921 - 2004)2024[52]

మూలాలు

గ్రంథసూచి


|}

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ