పుష్పవల్లి
పెంటపాడు పుష్పవల్లి, అలనాటి తెలుగు సినిమా నటి, జెమినీ గణేశన్ భార్య, ప్రముఖ హిందీ సినిమా నటి రేఖ తల్లి.
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/3f/Pushpavalli_mohini.jpg/175px-Pushpavalli_mohini.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/3/3b/Pushpavalli_in_pempudukoduku.jpg/175px-Pushpavalli_in_pempudukoduku.jpg)
విశేషాలు
ఈమె తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న పెంటపాడు గ్రామంలో 1926 జనవరి 3వ తేదీన కందాళ తాతాచారి, రామకోటమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ఐదవ తరగతి వరకు చదివింది. ఈమె అసలు పేరు కందాళ వెంకట పుష్పవల్లి తాయారు.[1] ఈమెకు పిన్నవయసు నుండే సినిమాలంటే ఆసక్తి ఉండేది. ఈమె తన పన్నెండవ యేట కుటుంబ సన్నిహితుడు అచ్యుతరామయ్య ప్రోద్బలంతో మొట్టమొదటి సారి సంపూర్ణరామాయణం సినిమాలో సీత వేషం వేసింది. తరువాత దశావతారములు సినిమాలో మోహిని, మాయ శశిరేఖ పాత్రలు ధరించింది.[2] ఆ తర్వాత ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశం లభించింది. జెమిని సంస్థలో పర్మనెంటు ఆర్టిస్టుగా నెలకు 200 రూపాయల జీతంతో చేరి 18 ఏళ్ళపాటు ఆ సంస్థ నిర్మించిన తమిళ, తెలుగు, హిందీ సినిమాలలో విరివిగా నటించింది. ఈమె చెల్లెలు సూర్యప్రభ కూడా సినిమా నటిగా రాణించింది. ఆమె వేదాంతం రాఘవయ్యను వివాహం చేసుకుంది. పుష్పవల్లి జెమినీ గణేశన్ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పటికే జెమినీ గణేశన్కు పెళ్ళి అయింది. ఈమె కూడా ఈ పెళ్ళికి ముందు రంగాచారిని వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్ళి మూడునాళ్ల ముచ్చట అయ్యింది. జెమినీ గణేశన్కు ఈమెకు బాబ్జీ, భానురేఖ, రమ, రాధ, ధనలక్ష్మి అనే సంతానం కలిగారు. వీరిలో భానురేఖ రేఖ పేరుతో హిందీ సినిమా రంగంలో ఒక తారగా వెలుగునొందింది. పుష్పవల్లి జెమినీ గణేశన్ల వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు. ఈమె 1992 మే 11న మరణించింది.
కొన్ని వివాదాల గురించి రూపవాణి పత్రికకు పుష్పవల్లి వ్రాసిన ఒక లేఖను ఇక్కడ చూడవచ్చును. [1][permanent dead link]
చిత్ర సమాహారం
- పెంపుడు కొడుకు
- వరవిక్రయం
- సంపూర్ణ రామాయణం (1936 సినిమా) - సీత
- దశావతారములు - మోహిని, మాయా శూర్పణఖ
- విశ్వమోహిని
- వింధ్యరాణి
- చూడామణి
- పాదుకా పట్టాభిషేకం
- చల్ మోహనరంగా
- మోహినీ భస్మాసుర - మోహిని
- మాలతీ మాధవం
- సత్యభామ (1942) - సత్యభామ
- బాలనాగమ్మ - సంగు
- సుడిగుండాలు
- తారాశశాంకం (1941)
మూలాలు
బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పుష్పవల్లి పేజీ