నెహ్రూ జంతుప్రదర్శనశాల
నెహ్రూ జంతుప్రదర్శనశాల (హైదరాబాద్ జూ లేదా జూ పార్క్ అని కూడా పిలుస్తారు) అనేది తెలంగాణలోని హైదరాబాద్ లోని మీర్ ఆలమ్ చెరువు సమీపంలో ఉన్న జంతుప్రదర్శనశాల. దీనిని అక్టోబరు 6, 1963లో ప్రధానమంత్రి నెహ్రూ పేరుమీద స్థాపించారు. ఇది తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్నది. ఇది 380 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండి, ఇంచుమించు 1,500 జాతుల జంతువులు, పక్షులు మొదలైన వాటిని రక్షిస్తున్నది.[1]
ప్రారంభించిన తేదీ | 12 అక్టోబర్ 1963 |
---|---|
ప్రదేశము | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
Coordinates | 17°21′04″N 78°26′59″E / 17.35111°N 78.44972°E |
విస్తీర్ణము | 380 ఎకరాలు (153.8 హె.) |
జంతువుల సంఖ్య | 1100 |
Number of species | 100 |
Memberships | సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా |
చరిత్ర
నెహ్రూ జంతుప్రదర్శనశాల 26 అక్టోబర్ 1959న శంకుస్థాపన చేయబడినది, 6 అక్టోబర్ 1963 నుంచి ప్రజల సందర్శనకు తెరవబడింది. ఈ ఉద్యానవనాన్ని తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ నడుపుతోంది. దీనికి భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టారు.[1]
వెబ్సైట్, మొబైల్ యాప్
నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్, మొబైల్ యాప్ను 2023 ఫిబ్రవరి 13న అరణ్య భవన్లో రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించాడు. పార్కుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతోపాటు సందర్శకులు సులువుగా జూ ఎంట్రీ టికెట్ బుకింగ్, బ్యాటరీ వెహికల్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే సదుపాయంతో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వెబ్సైట్, మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే, పీసీసీఎఫ్ అండ్ హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్ఎం.డోబ్రియాల్, అటవీ శాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, జూపార్క్ క్యూరేటర్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.[2]
ప్రవేశ రుసుము
2021, అక్టోబర్ 1-వ తేదీ మొదలు ధరలు సవరించబడినవి. వాటి వివరములు
- పెద్దలకు: వార రోజులలో రూ.60, వారాంతములలో రూ.75
- పిన్నలకు: వార రోజులలో రూ.40, వారాంతములలో రూ.50
- బొమ్మ రైలు టిక్కెట్: అన్ని రోజులలో పెద్దలకు రూ.40, పిన్నలకు రూ.20
- సఫారీ పార్క్: సి.ఎన్.జి బస్సులోనైతే పెద్దలకు రూ.75, పిన్నలకు రూ.40, ఏ.సీ. బస్సులైతే పెద్దలకైనా, పిన్నలకైనా రూ.120
- జంతు ప్రదర్శన శాలయందు వ్యక్తిగత కార్లకు అనుమతి లేదు. బ్యాటరీతో నడిచే వాహనములు అద్దెకు లభించును.
- పది మంది కూర్చొనగలిగే బ్యాటరీ వాహనము, రెండు గంటలపాటు, అద్దె రూ.2500/-
- పదునాలుగు మంది కూర్చొనగలిగే బ్యాటరీ వాహనము, రెండు గంటలపాటు, అద్దె రూ.3000/-
- ఇవే బ్యాటరీ వాహనములను హాప్-ఆన్-హాప్-ఆఫ్ (కావలసిన చోటు ఎక్కడం, కావలసిన చోటు దిగడం) టిక్కెట్ పెద్దలకు వార దినాలలో రూ.85, వారాంతములలో రూ.100, పిన్నలకు వార దినములలో రూ.50, వారాంతములలో రూ.60
- కెమేరా: స్టిల్ కెమేరా అనుమతి రుసుము: రూ.120, వీడియో కెమేరా అనుమతి రుసుము రూ.600
ఛాయాచిత్రాలు
- ఎలుగుబంటి
- నెహ్రూ జంతు ప్రదర్శన శాలలో జింకలు