జానకీ దేవి బజాజ్
జానకీ దేవి బజాజ్ ( 1893 జనవరి 7 - 1979 మే 21) 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించిన ఒక భారతీయ స్వాతంత్ర్య సమర యోధురాలు.[1][2]
ప్రారంభ జీవితం, వృత్తి
ఆమె 1893 జనవరి 7న మధ్యప్రదేశ్లోని జాయోరాలో అగర్వాల్ కుటుంబంలో జన్మించింది. ఎనిమిదేళ్ల వయసులో, ఆమె 12 ఏళ్ల జమ్నాలాల్ బజాజ్ ను వివాహం చేసుకుంది. జమ్నాలాల్ కుడా స్వాతంత్ర్య పోరాట ఉద్యమంలో పాల్గొన్నాడు, జానకీదేవి కూడా చరఖాపై ఖాదీ వడకడం, గోసేవ, హరిజనుల జీవితాల మెరుగుదల, వారి ఆలయ ప్రవేశం కోసం 1928లో పొరాడింది. స్వాతంత్ర్యం తర్వాత, ఆమె వినోబా భావేతో కలిసి భూదాన్ ఉద్యమంలో పనిచేసింది. ఆమె 1942 నుండి చాలా సంవత్సరాలు అఖిల భారతీయ గోసేవా సంఘ్ అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆమెకు 1956లో పద్మవిభూషణ్ రెండవ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ఆమె 1965లో మేరీ జీవన్ యాత్ర పేరుతో తన ఆత్మకథను ప్రచురించింది.[3]
వారసత్వం
జానకీ దేవి బజాజ్ 1979లో మరణించింది. ఆమె జ్ఞాపకార్థం జానకీ దేవి బజాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, జానకీ దేవి బజాజ్ గవర్నమెంట్ పిజి గర్ల్స్ కాలేజ్ కోట, బజాజ్ ఎలక్ట్రికల్స్, జానకీదేవి బజాజ్ గ్రామ వికాస్ సంస్థ వంటి అనేక విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ఇండియన్ మర్చంట్స్ ఛాంబర్ లేడీస్ వింగ్ 1992-93 సంవత్సరంలో గ్రామీణ పారిశ్రామికవేత్తల కోసం ఐఎంసి-లేడీస్ వింగ్ జానకీదేవి బజాజ్ పురస్కారాన్ని స్థాపించింది.[4][5]
రచనలు
జానకీ దేవి, మేరీ జీవన్ యాత్ర (నా జీవన యాత్ర) పేరుతో తన ఆత్మ కథను రచించింది.[6]