గొర్రెల పంపిణీ పథకం
గొర్రెల పంపిణీ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని యాదవ, కురుమ వర్గాలకు చెందిన వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేసే పథకం.[1] తొలి విడతలో 5,064.42 కోట్ల రూపాయలతో 3.93 లక్షల మందికి 82.64 లక్షలు గొర్రెలు పంపిణీ చేయబడ్డాయి.[2]
గొర్రెల పంపిణీ పథకం | |
---|---|
పథకం రకం | సబ్సిడీ |
ప్రాంతం | తెలంగాణ, భారతదేశం |
వ్యవస్థాపకులు | తెలంగాణ ప్రభుత్వం |
ముఖ్యమంత్రి | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
స్థాపన | 20 జూన్ 2017 |
బడ్జెట్ | ₹12,000 కోట్లు |
స్థితి | Active |
చరిత్ర
2017, జూన్ 20న సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ సమీపంలోని కొండపాకలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రారంభించాడు. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను (ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది) అందజేశాడు. [3] మొదటి విడతలో యూనిట్కు 1.25 లక్షల ఖర్చులో ప్రభుత్వం 75%, లబ్ధిదారుడు 25% ఖర్చు భరించాల్సివుంటుంది.
పథకం
గొల్ల, కురమ వర్గాల వారు తమ సాంప్రదాయ వృత్తులలో సాధికారత సాధించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతమవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రారంభించబడింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య (టిఎస్ఎస్జిడిసిఎఫ్) ఆధ్వర్యంలో ఈ పథకం అమలు చేయబడుతోంది. రాష్ట్రంలో గొర్రెల నికర జనాభాను పెంచడానికి ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలను (నెల్లూరు బ్రౌన్ (డోరా), నెల్లూరు జోడిపి (ముఖం మీద నల్ల మచ్చలతో తెలుపు), డెక్కానీ, మద్రాస్ రెడ్ జాతలకు చెందినవి) కొనుగోలు చేస్తారు.[4]
- అర్హత: తెలంగాణలోని కురుమలు, యాదవులకు అనుబంధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. గొర్రెల కాపరి సమాజానికి చెందిన 18 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తి ఈ పథకానికి అర్హులు. అర్హులైన వారికి ఒక యూనిట్ ఇవ్వబడుతుంది.[5] సబ్సిడీపై గొర్రెలు తీసుకోవాలంటే గొర్రెల పెంపకం సొసైటీలలో తప్పనిసరి సభ్యత్వం ఉండాలి.
- మొబైల్ వెటర్నరీ యూనిట్లు: జంతువుల అనారోగ్యం, చికిత్సకు సంబంధించి ప్రభుత్వం ఆధ్వర్యంలో మొబైల్ వెటర్నరీ యూనిట్లు ప్రారంభించబడ్డాయి. దీని టోల్ ఫ్రీ నెంబరు 1962.
- భీమా:గొర్రెలకు ₹ 5,000, పొట్టేలుకు ₹ 7,000 ల భీమా ఉంటుంది.
- పశుగ్రాసం: గొర్రెలకు పశుగ్రాసం అందించడానికి గడ్డి విత్తనాలపై ప్రభుత్వం నుండి 75% రాయితీ అందుతోంది.
మొదటి విడత
మొదటి విడత గొర్రెల పంపిణీ ఫలితాలు:[6]
- గొర్రెల పెంపకందార్ల సొసైటీలు: 8,109
- సొసైటీలోని మొత్తం సభ్యులు: 7,61,895
- మొదటి విడత లబ్ధిదారులు: 3,93,223
- పంపిణీ చేసిన గొర్రెలు: 82,64,000
- మొదటి విడతకోసం ప్రభుత్వం చేసిన ఖర్చు: రూ. 5,064.42 కోట్లు
- ఈ గొర్రెలకు పుట్టిన పిల్లల సంఖ్య: సుమారు 1.37 కోట్లు
- గొర్రెల పంపిణీతో పెరిగిన సంపద: 8,000 కోట్లు
రెండవ విడత
రెండోవిడత గొర్రెల పంపిణీకి అర్హులైన లబ్ధిదారులు 3,85,675 మందికాగా, ఇందుకోసం రూ.6 వేల కోట్లు కేటాయించారు. పాత పద్ధతిలోనే గొర్రెల యూనిట్సంఖ్య ఉంటుండగా, గతంలో రూ.1.25,000గా ఉన్న యూనిట్ ధరను మాత్రం రూ.1,75,000 కు పెంచారు. ఇందులో ప్రభుత్వం రూ. 1,31,250 చెల్లించగా లబ్ధిదారుడు రూ.43,750 భరించాల్సి ఉంటుంది.[7] రెండో విడత గొర్రెల యూనిట్ల కొనుగోలుకు 2022 అక్టోబరు 17న 600 కోట్ల రూపాయలు మంజూరు చేయబడ్డాయి. నిధుల మంజూరు ద్వారా రాష్ట్రంలోని 3.60 లక్షల మంది గొర్రెల పెంపకందారులకి లబ్ధి చేకూరుతుంది.[8]
2023, జూన్ 9న మంచిర్యాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్దిదారులలో కొందరికి గొర్రెలను పంపిణీ చేశాడు.[2] ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, దేవాదాయ శాఖామంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీసి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఆదిలాబాదు ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే ఆజ్మీరా రేఖా నాయక్తోపాటు జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లాలో నకిరేకల్లో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులకు గొర్రెలు అందజేశారు.[9]
పంపిణీ వివరాలు
2018, మార్చి నాటికి 1 కోటి 28 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు. మొత్తంగా 7.61 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత కలిగిన రెండు లక్షల మంది సభ్యులకు గొర్రె యూనిట్లను అందజేశారు.[10]
ఫలితాలు
గొర్రెల ఉత్పత్తిలో రాజస్తాన్ను అధిగమించి తెలంగాణ దేశంలో నంబర్వన్ స్థానానికి చేరుకుంది. రెండువిడతల్లో కలుపుకుని తెలంగాణ గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.11వేల కోట్లు కేటాయించారు.[6]
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ఏర్పాటు సమయంలో తెలంగాణలో గొర్రెల సంఖ్య 1.28 కోట్లు ఉండగా, ఇప్పుడు ఇది 1.91 కోట్లకు పెరిగింది. తెలంగాణ తర్వాత 1.76 కోట్ల గొర్రెలతో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో, 1.10 కోట్ల గొర్రెలతో కర్ణాటక మూడో స్థానంలో నిలిచాయి.[2]
విమర్శ
గొర్రెల పంపిణీ సమయంలో ఈ పథకాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి.[11]