గద్దర్
గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు (1949 జనవరి 31[2][3] - 2023, ఆగస్టు 6) విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ" కు గుర్తుగా తీసుకోవడం జరిగింది.[4]
గద్దర్ | |||
![]() 2005లో నిజాం కాలేజీ గ్రౌండ్స్లో జరిగిన సమావేశంలో గద్దర్ | |||
వ్యక్తిగత వివరాలు | |||
---|---|---|---|
జననం | 1949 తూప్రాన్, మెదక్, తెలంగాణ | ||
మరణం | (aged 74) | ||
రాజకీయ పార్టీ | తెలంగాణ ప్రజా ఫ్రంట్ | ||
జీవిత భాగస్వామి | విమలా గద్దర్[1] | ||
సంతానం | సూర్యా, చంద్రం, వెన్నెల | ||
నివాసం | హైదరాబాదు, తెలంగాణ | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
జీవిత విశేషాలు
గద్దర్ మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1948లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా మహబూబ్ నగర్ లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నాడు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నాడు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వాడు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.
కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకథలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవాడు. ఆ తర్వాత అతను అనేక పాటలు రాసాడు. 1972 లో పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జన నాట్య మండలి ఏర్పడింది. ఇది దళితులను మేల్కొలిపేందుకు, వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ పరీక్షను రాసాడు. అయన కెనరా బ్యాంకులో క్లార్క్ గా చేరాడు, తర్వాత అతను విమలను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు), వెన్నెల.
మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడాడు.[5] 1984 లో ఆయన క్లార్కు ఉద్యోగానికి రాజీనామా చేసాడు. 1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన, ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సిడిలుగా రికార్డ్ అయ్యి అత్యధికంగా అమ్ముడుపోయాయి.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/52/Gaddar_performs_in_Kolkata.jpg/258px-Gaddar_performs_in_Kolkata.jpg)
మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించాడు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు.
1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో బుల్లెట్ ఉంది.[6] ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, వరవరరావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రంగా నిరసించాడు.
తెలంగాణ ఉద్యమంలో
తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించాడు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకోలేదు.
గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. [7][8][9] దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టినప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ను స్థాపించాడు.
సినిమారంగం
మాభూమి సినిమాలోని బండెనక బండి కట్టి అనే పాటను పాడడంతోపాటు పాటలో నటించాడు. ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమా" అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డును తిరస్కరించారు. ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది.[10] . ఈ పాటకు నంది అవార్డు సైతం వచ్చింది. అలాగే ఆయన రాసి పాడిన ‘అమ్మా తెలంగాణ ఆకలికేకల గానమా’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర సర్కార్ ఎంపిక చేసింది.[11] 2016లో దండకారణ్యం మువీ, 2022లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘గాడ్ ఫాదర్’ లో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు.[12]
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తీసిన ఉక్కు సత్యాగ్రహం అనే సినిమాలో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఇదే గద్దర్ నటించిన చివరి సినిమా.[12]
రచనలు,పాటలు
- అమ్మ తెలంగాణ
- మల్లెతీగ కు పందిరి వోలె
- పొడుస్తున్న పొద్దు మీద
అవార్డు
- 1995: నంది ఉత్తమ గీత రచయిత (ఒరేయ్ రిక్షా సినిమాలోని "మల్లెతీగ కు పందిరి వోలె" పాట రచన... కానీ ఆయన అవార్డును తిరస్కరించాడు)[13]
- 2011: నంది ఉత్తమ నేపథ్య గాయకులు (జై బోలో తెలంగాణ సినిమాలోని "పొడుస్తున్న పొద్దు మీద" పాట)[14]
- ఈశ్వరీబాయి మెమోరియల్ సెంచరీ అవార్డు[15]
మరణం
గుండెపోటు కారణంగా 2023 జూలై 20న హైదరాబాద్, అమీర్ పేట్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన గద్దర్ కు ఆగస్టు 3న వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. తరువాత ఆసుపత్రిలోనే చికిత్సపొందిన గద్దర్ ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో 2023, ఆగస్టు 6న మధ్యాహ్నం 3 గంటలకు మరణించాడు.[16][17][18]
గద్దర్ మృతికి తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతోపాటు[19] రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.[20] ఆగస్టు 6 సాయంత్రం నుండి ఆగస్టు 7 మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం గద్దర్ భౌతికకాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచబడింది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, కవులు, కళాకారులు, వేలాదిగా అభిమానులు గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఎల్బీ స్టేడియం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర గన్పార్కు నుంచి బషీర్బాగ్, లిబర్టీ, జేబీఎస్ మీదుగా 6 గంటలపాటు 17 కిలోమీటర్ల దూరమున్న అల్వాల్లోని గద్దర్ నివాసం వరకు కొనసాగింది.[21] అక్కడ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు.[22] గద్దర్ స్థాపించిన మహాబోధి పాఠశాల ఆవరణలో అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరిగాయి.[23][24]
గద్దర్ జయంతి వేడుకలు
దివంగత గద్దర్ జయంతిని ప్రతి ఏడాది జనవరి 31న అధికారికంగా నిర్వహించాలని ఆయన కూతురు వెన్నెల మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసి విజ్ఞప్తి చేయగా [25], దీనిపై స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయగా జనవరి 31న ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.[26]
మూలాలు
బాహ్య లంకెలు
- "Gaddar Biography: స్వేచ్ఛగా తిరుగు బాట కోసం తిరుగుబాటు చేసిన గద్దర్ జీవిత విశేషాలు!.. - SumanTV". web.archive.org. 2023-08-06. Archived from the original on 2023-08-06. Retrieved 2023-08-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)