కంటి వెలుగు
కంటి వెలుగు తెలంగాణ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుంది. ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.
కంటి వెలుగు | |
---|---|
దస్త్రం:Kanti Velugu .jpg కంటి వెలుగు | |
ప్రాంతం | మల్కాపూర్, మెదక్ జిల్లా, తెలంగాణ, భారతదేశం |
ప్రధాన వ్యక్తులు | తెలంగాణ ప్రజలు |
స్థాపన | ఆగస్టు 15, 2018 |
వెబ్ సైటు | అధికారిక వెబ్సైటు |
నిర్వాహకులు | తెలంగాణ ప్రభుత్వం |
ప్రారంభం
ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. ఇదే రోజూ గవర్నర్ నరసింహన్ మహబూబ్నగర్ జిల్లా మరికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఐదు నెలలపాటు కొనసాగుతుంది.[1] ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు కేటాయించింది.
2023 జనవరి 18న ఖమ్మం పట్టణంలో రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. తొలిరోజు మొత్తం 50 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో తొలి ఆరుగురికి కంటి పరీక్షల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రలు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, కంటి వెలుగు లబ్ధిదారులకు కంటి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.[2][3]
పథకం
గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిగా, పట్టణాల్లో వార్డును పరిధిగా కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తారు. ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లతో కూడిన ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన బృందం సేవలందిస్తుంది. ఈ వైద్యబృందం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకంలో 799 బృందాల్లో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, 1000 మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. 33 వేల మంది సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం కేటాయించారు.
ఈ పథకం మొత్తం బడ్జెట్ దాదాపు 106.84 కోట్లు ఉంటుండగా, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం. రూ. 84కోట్లు అందజేస్తుంది. మిగిలిన రూ.24 కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ కింద వెచ్చిస్తారు. పథకంలో భాగంగా ఇచ్చిన రీడింగ్ గ్లాసెస్ ద్వారా 23,43,642 మంది వ్యక్తులు ప్రయోజనం పొందగా, ప్రిస్క్రిప్షన్ అద్దాలు పొందిన లబ్ధిదారులు 14,95,972 మంది ఉన్నారు. ఈ మొత్తం పథకానికి రూ. 196.79 కోట్ల నిధుల కేటాయింపు ఉండగా, పథకం అమలులోకి వచ్చిన 1 సంవత్సరంలోనే అవన్నీ ఉపయోగించబడ్డాయి.
లక్ష్యాలు
- రాష్ట్రంలోని పౌరులందరికి కంటి స్క్రీనింగ్, విజన్ పరీక్షను నిర్వహించడం
- కంటి అద్దాలను ఉచితంగా సమకూర్చడం
- సర్జరీలు, ఇతర చికిత్సలను ఉచితంగా ఏర్పాటు చేయడం
- సాధారణ కంటి వ్యాధులకు మందులను సమకూర్చడం
- హానికరమైన కంటి వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం[4]
కంటి సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజలు కంటి సమస్యలతో బాధ పడుతున్నారు.
కంటి వ్యాధులు | సంఖ్య |
---|---|
శుక్లాలు | 43 శాతం |
బాల్యంలో అంధత్వం | 4 శాతం |
నెలలు నిండని శిశువులకు సమస్యలు | 4 శాతం |
డయాబెటిక్ రెటీనోపతి | 7 శాతం |
చూపు మందగించడం | 3 శాతం |
నీటి కాసులు (గ్లకోమా) | 7 శాతం |
వివరాలు
- మొదటి విడత: సుమారు 8 నెలలపాటు కొనసాగిన ఈ పథకంలో భాగంగా 2018లో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు ఒక లక్షా యాభై వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించి రికార్డులో నిలిచింది.[5] అధికారిక సమాచారం ప్రకారం 2021, జనవరి 1 వరకు తెలంగాణలో కంటి వెలుగు పథకం ద్వారా 38 లక్షల మంది లబ్ధిదారులకు సహాయం అందించబడింది.[6] మొత్తంమీద 23,43,643 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వబడ్డాయి. మొదటి విడతలో మొత్తం కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేయడం జరిగింది.
- రెండవ విడత: 2023, జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజులపాటు రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. 89 రోజుల పనిదినాలల్లో కోటి 58 లక్షల 35 వేల 947 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 22 లక్షల 21 వేల 494 మందికి (74 లక్షల 42 వేల 435 మంది పురుషులు, 83 లక్షల 73 వేల 097 మంది స్త్రీలు, 10,955 మంది ట్రాన్స్ జెండర్స్) ఉచితంగా కళ్ళద్దాలు, మందులు అందజేయబడ్డాయి. కోటి 18 లక్షల 26 వేల 614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని తేలింది.[7]