ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్
ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనేది కల్పిత నవలల సిరీస్. ఈ నవలలను అమెరికాకు చెందిన ప్రముఖ నవలాకారుడు, చిత్ర రచయిత జార్జ్ ఆర్.ఆర్.మార్టిన్ రచించాడు. 1991లో ఈ సిరీస్ మొదటి నవల ఎ గేం ఆఫ్ థ్రోన్స్ ను ప్రారంభించి, 1996లో ప్రచురించాడు. మొదట ఈ సిరీస్ లో మూడు నవలలు రాద్దామనుకున్న అతను దానిని ఏడు నవలలు చేశాడు. ఇప్పటివరకూ అయిదు నవలలను ప్రచురించాడు. 2011లో ఐదవ నవల ఎ డ్యాన్స్ విత్ డ్రాగన్స్ ను విడుదల చేశాడు. ఈ నవల రాసేందుకు అతనికి ఆరు సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం ఆరవ నవల ది విండ్స్ ఆఫ్ వింటర్ రాస్తున్నాడు.
| |
రచయిత | జార్జి ఆర్.ఆర్. మార్టిన్ |
---|---|
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
భాష | ఆంగ్లం |
కళా ప్రక్రియ | ఎపిక్ ఫాంటసీ [1] |
ప్రచురణకర్త |
|
ప్రచురణ | August 1996–ప్రస్తుతం |
మీడియా రకం | Print (hardback & paperback) audiobook |
ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నవల వెస్టరస్, ఎస్సస్ అనే రెండు కల్పిత ఖండాలలో జరుగుతుంది. మొదటి నవలలో 9 పాత్రాలతో మొదలైన ఈ సిరీస్, ఐదవ నవల వచ్చేసరికి 31 పాత్రలుగా పెరిగింది. ఈ నవలలోని ప్రతి భాగం ఈ పాత్రల మధ్యే జరుగుతుంది. ఈ సిరీస్ లో మూడు ప్రధాన కథలు నడుస్తూ ఉంటాయి. వెస్టరస్ ఖండాన్ని గెలుచుకునేందుకు చాలా వంశాల మధ్య జరిగే యుద్ధం ఒక కథ. వెస్టరస్ లోని ఉత్తర ప్రాంతాలలో పెరుగుతున్న మానవాతీత శక్తుల ముప్పు మరోటి. అధికారం నుంచే దించివేయబడిన డేనెరిస్ టర్గర్యన్ అనే రాజు కూతురు సింహాసనం కోసం చేసే ప్రయత్నం మూడవ కథ. ఆ రాజు కూతురు అంతకు మునుపే వెలివేయబడుతుంది.
ఇంగ్లాండ్ అంతర్యుద్ధం ఆధారంగా రాసిన వార్స్ ఆఫ్ ది రోజెస్, మౌరిస్ డ్రౌన్ రాసిన ఫ్రెంచి కల్పిత నవలా సిరీస్ ది అకర్స్డ్ కింగ్స్, మార్టిన్ కు ప్రేరణగా నిలిచాయి. ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ లో వాస్తవికంగా, మహిళల గురించి, మతం గురించి విభిన్నంగా చిత్రించిన తీరుకు మార్టిన్ కు ఎన్నో ప్రశంసలు లభించాయి. అయితే ఒక కథ మధ్య మరో కథ రావడం, పాత్రల ధృక్కోణంలో ఆకస్మిక మార్పులు రావడంతో పాఠకులు కాస్త తికమకపడే అవకాశాలు ఉన్నా, ఆ కథలు బలంగా ఉండటం వల్ల పాఠకాదరణ ఎక్కువగానే ఉంది. ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ లో చిత్రించిన ప్రపంచం ముందు నుంచే నైతికంగా అస్పష్టమైనది కాగా, రాజభక్తి, ప్రతిష్ఠ, గౌరవం, మానవ లైంగిక సంబంధాలు, భక్తి, హింస, దాని నైతికత వంటి విషయాలపై పాఠకులకు తరచూ ప్రశ్నలు తలెత్తుతుంటాయి.
2016 ఆగస్టు నాటికి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 కోట్లకు పైగా పుస్తకాలు అమ్ముడుపోయాయి.[2] జనవరి 2017 నాటికి, దాదాపు 47 భాషలలోకి అనువాదం అయింది.[3][4] ఈ సిరీస్ లోని నాలుగు, ఐదు నవలలు, అవి విడుదలైన సమయంలో న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి.[5] ఈ సిరీస్ ఆధారంగా ఎన్నో ప్రీక్వెల్ నవలలు, ఒక టీవీ సిరీస్, కామిక్ పుస్తకాలు, కార్డ్, బోర్ద్, వీడియో గేమ్ లు వచ్చాయి.
కథ సారాంశం
ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నవల కల్పిత ప్రపంచంలో జరుగుతుంది. ఆ ప్రపంచంలో సంవత్సరాల తరబడి ఒకే ఋతువు ఉంటుంది. అలాగే అనూహ్యంగా ముగిసిపోతాయి కూడా. మొదటి నవల, కథా కాలానికి దాదాపు మూడు వందల ఏళ్ళ ముందు మొదలవుతుంది. వెస్టరస్ ఖండంలోని ఏడు రాజ్యాలను టర్గర్యన్ వంశం పరిపాలిస్తూ ఉంటుంది. ఆ రాజ్యాలకు ఏగన్ టర్గర్యన్ అనేవాడు చక్రవర్తి. ఈ రాజ్యాలను ఏగన్ I, అతని సోదరీమణులు విసెన్య, రేన్యాలు కలసి ఏకం చేశారు. ఎ గేం ఆఫ్ థ్రోన్స్ నవల ప్రారంభంలో, టర్గర్యన్ వంశపు ఆఖరి రాజైన ఏర్యస్ II ను తిరుగుబాటుదారుడైన లార్డ్ రాబర్ట్ బరతియన్ చంపి, తనను తాను ఆ ఏడు రాజ్యాలకూ చక్రవర్తిగా ప్రకటించుకుంటాడు. ఆ తరువాత 15 ఏళ్ళు ప్రశాంతంగా గడిచిపోతాయి. ఆ తరువాత ఈ కల్పిత ప్రపంచంలో 9 ఏళ్ళ సుదీర్ఘ వేసవి ముగిసిపోతుంది.
టీవీ సిరీస్
ఈ సిరీస్ కు పాఠకాదరణ విపరీతంగా పెరగడంతో హెచ్.బి.ఒ చానెల్ 2007లో ఎ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ నవల ఆధారంగా ఒక టీవీ సిరీస్ ను ప్రారంభించింది.[6] 2009లో ఒక పైలట్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు. ఆ తరువాత మార్చి 2010లో తొమ్మిది ఎపిసోడ్లు చిత్రీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.[7] గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరుతో ఈ టీవీ సిరీస్ ను ఏప్రిల్ 2011లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీవీ సిరీస్ అత్యధిక రేటింగ్ తో అగ్రస్థానంలో నిలవడం విశేషం. రెండు రోజుల తరువాత, ఎ క్లాష్ ఆఫ్ కింగ్స్ నవల ఆధారంగా గేం ఆఫ్ థ్రోన్స్ సీజన్ 2 చిత్రీకరించాలని చానెల్ ఒప్పందం చేసుకుంది.[8]