ఇండియన్ ముజాహిదీన్
ఇండియన్ ముజాహిదీన్ అనేది అబ్దుల్ సుభాన్ ఖురేషీ నేతృత్వంలోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. ఖురేషి ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నాడు. [1] భారత ప్రభుత్వం, ఇండియన్ ముజాహిదీన్ను 2010 జూన్ 4 న ఉగ్రవాద సంస్థగా ప్రకటించి, నిషేధించింది. [2] [3] [4] 2010 అక్టోబరు 22 న న్యూజిలాండ్, దానిని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. 2011 సెప్టెంబరులో, అమెరికా ఇండియన్ ముజాహిదీన్ను తన విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ బృందం భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడిందని, దక్షిణాసియా అంతటా "ఇస్లామిక్ కాలిఫేట్"ను సృష్టించడం అంతిమ లక్ష్యం కాగా, ప్రాంతీయ ఆకాంక్షలు ఉన్నాయని విదేశాంగ శాఖ చెప్పింది. [5] విచక్షణారహితంగా హింసను సృష్టించి, భారతదేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని సృష్టించడం, షరియా చట్టాన్ని అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి, ఈ గ్రూపును యునైటెడ్ కింగ్డమ్ నిషేధించింది. [6]
కింది స్థాయి SIMI సభ్యులే సభ్యులుగా కలిగిన అనేక సమూహాలలో ఇండియన్ ముజాహిదీన్ ఒకటి అని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారం, SIMI అగ్ర నాయకత్వాన్ని అదుపులోకి తీసుకున్నందున SIMI కొత్త పేర్లు పెట్టుకుంది. [7] SIMI-అనుబంధ ఉగ్రవాదులు విదేశీయులతో కూడిన సమూహంగా కాకుండా భారతదేశ ముస్లిం సమాజం నుండే మరింత మద్దతును పొందేందుకు ప్రయత్నిస్తున్నందున ఈ పేర్ల మార్పు, వారి వ్యూహాలలో వచ్చిన మార్పును సూచిస్తుందని భావిస్తున్నారు. [8] 2008 మే 13 జైపూర్ బాంబు దాడులు జరిగిన రెండు రోజుల తర్వాత, ఆ దాడులకు బాధ్యత తమదేనని ప్రకటిస్తూ ఈ తీవ్రవాద సంస్థ [9] భారతీయ మీడియాకు ఒక ఈమెయిలు పంపింది. [10] "భారతదేశంలో ఉన్న అవిశ్వాసులందరినీ (ఇస్లాం తప్పించి మిగతా అన్ని మతాలను) నాశనం చేస్తామని అందులో చెప్పారు. [11] 2008లో జరిగిన అహ్మదాబాద్ వరుస పేలుళ్లు ఈ గుంపు ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద దాడి. 50 మంది మరణించిన ఈ దాడి ఇది జాతీయ స్థాయిలో అలజడి కలిగించింది.
సభ్యులు
ఇండియన్ ముజాహిదీన్ గ్రూపుకు చెందిన ప్రధాన నేతలు వీరేనని అనుమానిస్తున్నారు. [12]
- అబ్దుల్ సుభాన్ ఖురేషి అలియాస్ తౌకీర్, 36, అరెస్టయ్యాడు: ముంబైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్; బాంబు తయారీలో నిపుణుడు, బాంబులు వెయ్యడాంలో 0నిపుణుడు
- సఫ్దర్ నగోరి, 38, అరెస్టయ్యాడు: SIMI సభ్యులను ఇండియన్ ముజాహిదీన్లుగా మార్చే నిపుణుడు
- ముఫ్తీ అబూ బషీర్, 28, అరెస్టయ్యాడు: ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్కు చెందిన మత బోధకుడు
- ఖయాముద్దీన్ కపాడియా, 28, అరెస్టయ్యాడు: వడోదరకు చెందిన వ్యాపారి, వడోదరలో అహ్లే హదీస్ తంజీమ్ కు చెందిన మొట్టమొదటి మసీదును ప్రారంభించాడు.
- సాజిద్ మన్సూరి, 35, అరెస్టయ్యాడు: సైకాలజీలో గ్రాడ్యుయేట్, గతంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- ఉస్మాన్ అగర్బత్తివాలా, (పరారీ), 25: వడోదరలో మానవ హక్కులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చదివాడూ
- అలంజేబ్ అఫ్రిది, 24, (పరారీ): అహ్మదాబాద్ నుండి ఒక నిరుద్యోగ యువకుడు ; సైకిళ్లను కొనుగోలు చేసి, బాంబులు కట్టి అహ్మదాబాద్లో అమర్చాడు
- అబ్దుల్ రజిక్ మన్సూరి, 27, (పరారీ): ఎంబ్రాయిడరీ యూనిట్ యజమాని
- ముజీబ్ షేక్, 25, (పరారీ): స్టోన్ పాలిషింగ్ ఆర్టిజన్
- జాహిద్ షేక్, 27, (పరారీ): అహ్మదాబాద్కు చెందిన మొబైల్ ఫోన్ రిపేర్ షాప్ యజమాని
- అమిల్ పర్వాజ్ (పరారీ): ఉజ్జయినికి చెందినవాడూ. 2007 నవంబరులో ఉత్తరప్రదేశ్లో జరిగిన కోర్టు బాంబు పేలుళ్లలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్నారు.
- యాసీన్ భట్కల్, 30, అరెస్టు: ఉత్తర కన్నడ జిల్లా లోని భత్కల్కు చెందినవాడు
ఢిల్లీ గ్రూప్
ఢిల్లీలోని స్థానిక సమూహం కింది వారిని [13] కలిగి ఉంటుందని భావిస్తున్నారు, వారిలో ఎక్కువ మంది అజంగఢ్కు చెందినవారు :
- మహ్మద్ అతీఫ్ (24) అనగా బషీర్: సెప్టెంబర్ 19న జామియా నగర్లోని బాట్లా హౌస్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్లానర్, రిక్రూటరు. మరణించాడు. గ్రేటర్ కైలాష్-1లోని ఎం-బ్లాక్ మార్కెట్లోను, వారణాసి లోనూ బాంబులు పెట్టాడు
- మహ్మద్ సైఫ్: సెప్టెంబర్ 19 ఎన్కౌంటర్ తర్వాత జామియా నగర్లోని బాట్లా హౌస్ నుండి అరెస్టయ్యాడు. కన్నాట్ ప్లేస్లోని రీగల్ సినిమా వద్ద బాంబు పెట్టాడు.
- జీషన్: జామియా నగర్ ఎన్కౌంటర్ తర్వాత అరెస్టయ్యాడు. కన్నాట్ ప్లేస్లోని బారాఖంబా రోడ్డులో బాంబు పెట్టాడు.
- మహ్మద్ సాజిద్ (16) అనగా పంకజ్: బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సమయంలో హతుడయ్యాడు. కన్నాట్ ప్లేస్లోని బారాఖంబా రోడ్డులో బాంబు పెట్టాడు.
- జునైద్: బాట్లా హౌస్ ఎన్కౌంటర్ సమయంలో తప్పించుకున్నాడు. గ్రేటర్ కైలాష్-1లోని ఎం-బ్లాక్ మార్కెట్లో, వారణాసిలో బాంబులు పెట్టాడు.
- మహ్మద్ షకీల్ (24): సెప్టెంబర్ 21న జామియా నగర్లో అరెస్టయ్యాడు. దక్షిణ ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్లో బాంబు పెట్టాడు.
- జియా-ఉర్-రెహ్మాన్ (22): సెప్టెంబర్ 21న జామియా నగర్లో అరెస్టు చేశారు. కన్నాట్ ప్లేస్ లోను, అహ్మదాబాద్లో సైకిల్పైనా బాంబు పెట్టాడు.
- సాకిబ్ నిసార్ (23): సెప్టెంబర్ 21న జామియా నగర్లో అరెస్టయ్యాడు.
- షాజాద్ అలియాస్ పప్పు: అజంగఢ్ నుండి UP STF అరెస్టు చేసింది. జామియా నగర్ ఎన్కౌంటర్లో అతడు తప్పించుకున్నాడు. కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్లో బాంబు పెట్టాడు.
- అలీహాస్ మాలిక్: (పరారీ). సెంట్రల్ పార్క్, కన్నాట్ ప్లేస్ వద్ద బాంబు పెట్టాడు.
- మహ్మద్ ఖలీఫ్: (పరారీ)
- ఆరిఫ్: (పరారీ)
- సల్మాన్: ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది.
ఇండియన్ ముజాహిదీన్ చేసామని చెప్పుకున్న దాడులు
ఇండియన్ ముజాహిదీన్, కింది ఉగ్రవాద ఘటనలకు తామే బాధ్యులమని చెప్పుకుంటూ ఈమెయిళ్ళు పంపింది. అహ్మదాబాద్లో మొదటి పేలుడుకు 5 నిమిషాల ముందు ఒక హెచ్చరిక ఈమెయిలు వచ్చింది. ఢిల్లీ బాంబు పేలుళ్లలో మొదటి పేలుడు జరిగిన వెంటనే మరొకటి వచ్చింది.
అనుమానితులు, అరెస్టులు
2013 ఆగస్టు 28 న, IM సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను, మరొక IM ఉగ్రవాదినీ భారత నేపాల్ సరిహద్దు సమీపంలో భారత పోలీసులు, NIA కలిసి అరెస్టు చేశారు. గుజరాత్ పోలీసుల ప్రకారం, 5 'స్విచ్ ఆఫ్' చేసిన మొబైల్ ఫోన్ నంబర్లను కూపీ లాగడం ద్వారా 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో పురోగతి లభించింది. [16] జూలై 26న, పేలుళ్లు జరిగిన రోజున, స్విచ్ ఆఫ్ చేసిన ఐదు ఫోన్ల సిమ్ కార్డులను ఉగ్రవాదులు సేకరించారని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) ఆశిష్ భాటియా తెలిపాడు. PCOల నుండి ఆ SIM కార్డ్లకు చేసిన ఫోన్ కాల్ల విశ్లేషణ వలన వారికి కీలకమైన ఆధారాలు అందాయి.
అరెస్టైన పది మంది అనుమానితులలో నాయకుడు ముఫ్తీ అబు బషీర్ ఇస్లాహి అలియాస్ అబ్దుల్ వాసిర్ కూడా ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సహాయంతో ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని సరాయ్ మీర్లోని అతని తండ్రి ఇంటి వద్ద అతన్ని 2008 ఆగస్టు 14 న అరెస్టు చేసారు. [17]
బషీర్ స్థానిక మదర్సతుల్ ఇస్లాలోను, ఆ తరువాత సహరాన్పూర్లోని దేవబంద్ లోనూ చదువుకున్నాడు. నివేదికల ప్రకారం, బాంబు పేలుళ్లకు రూ.75,000 ఖర్చవుతుందని బషీర్ పేర్కొన్నాడు. ఓ సిమి కార్యకర్త, కచ్లోని తన ఇంటిని అమ్మి ఆ సొమ్ము అందించాడు. [18]
సహచరుడు అబ్దుల్ సుభాన్ ఖురేషీ అలియాస్ తౌకీర్తో కలిసి అహ్మదాబాద్లో మకాం వేసిన బషీర్, స్థానిక పేర్లు, చిరునామాలాతో ఐదు సిమ్కార్డులు కొనుగోలు చేశాడు. [19] కుట్ర ప్రణాళిక దశలో ఉన్నపుడు ఇతర సభ్యులతో సన్నిహితంగా ఉండటానికి అతను ఈ సెల్ ఫోన్ నంబర్లను ఉపయోగించాడు. జులై 26న బషీర్, బాంబు పెట్టేవాళ్ళకు సిమ్ కార్డులు ఇచ్చాడు. వారు వాటిని జాగ్రత్తగా ఉపయోగించారు. ప్రతి సభ్యుడు బాంబులను విజయవంతంగా అమర్చిన తర్వాత STD-PCO బూత్ల ద్వారా ఇతరులను సంప్రదించారు. ఈ నంబర్లను కాల్లను స్వీకరించడానికి మాత్రమే ఉపయోగించారు. గ్రూప్లోని కీలక సభ్యులలో ఒకడు, సర్ఖేజ్ హైవే సమీపంలోని సంధి అవెన్యూలో నివసించే జాహిద్ షేక్ నుండి చాలా కాల్లు వచ్చాయి. పేలుళ్లు జరిగిన వెంటనే ఈ నంబర్లు పనిచెయ్యడం ఆగిపోయింది.
2013 ఫిబ్రవరి 21 రాత్రి 7:01 గంటలకు హైదరాబాద్లో జరిగిన రెండు పేలుళ్లకు కూడా ఇండియన్ ముజాహిదీనే కారణమని ప్రభుత్వం అనుమానిస్తోంది.
2014 మార్చిలో, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ IMకి చెందిన నలుగురు సభ్యులను అరెస్టు చేసింది, వారిలో ఒకరు బాంబు తయారీలో నిపుణుడైన వకాస్ అలియాస్ జావేద్. వీరిని రాజస్థాన్లోని జైపూర్, జోధ్పూర్లలో అరెస్టు చేశారు.
న్యూఢిల్లీలోని జామా మసీదులో ఉగ్రదాడితో సహా పలు కేసుల్లో వాంటెడ్ గా ఉన్న ఎజాజ్ షేక్ను 2014 సెప్టెంబరు 6 న పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ప్రాంతంలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం అరెస్టు చేసింది. అతను "సాంకేతిక నిపుణుడు". ఇండియన్ ముజాహిదీన్ (IM) లో కీలక సభ్యుడు.
ఇవి కూడా చూడండి
- హర్కత్-ఉల్-జిహాద్ అల్-ఇస్లామీ (హుజి)
- స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)
- లష్కరే తోయిబా